చిరస్థాయిగా మహానటి

Keerthy Suresh, Dulquer Salmaan and Samantha Akkineni starrer - Sakshi

అలనాటి అందాలతార, అభినయ రాణి సావిత్రి జీవితం ఆధారంగా తమిళ్, తెలుగు భాషల్లో రూపొందుతున్న చిత్రం ‘మహానటి’. తమిళ్‌లో ‘నడిగర్‌ తిలకం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కీర్తీ సురేశ్‌ టైటిల్‌ రోల్‌లో, సమంత, దుల్కర్‌ సల్మాన్, విజయ్‌ దేవరకొండ ముఖ్య తారలుగా నాగ అశ్విన్‌ దర్వకత్వంలో రూపొందుతోంది. మోహన్‌బాబు, ప్రకాశ్‌రాజ్, భానుప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏఎన్నార్‌ పాత్రలో నాగచైతన్య కనిపించనున్నారు.వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్‌ పతాకాలపై ప్రియాంకా దత్‌ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ముఖ్య తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

మరోవైపు పోస్ట్‌ప్రొడక్షన్‌ వర్క్స్‌ కూడా స్టార్ట్‌ చేశారు. మే 9న ‘మహానటి’ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ఉగాది సందర్భంగా చిత్రబృందం అధికారికంగా తెలియజేసింది. దాదాపు 27 ఏళ్ల కిత్రం వైజయంతీ మూవీస్‌ సంస్థ నుంచి 1990 మే 9న చిరంజీవి, శ్రీదేవి నటించిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సినిమా విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు అదే తేదీన ‘మహానటి’ చిత్రం విడుదల కానుండటం విశేషం. ‘‘మహానటి సావిత్రి కథని వెండితెరపై దర్శకుడు ఆవిష్కరించిన తీరు తెలుగు ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.
 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top