విజయ్‌ని కావాలనే టార్గెట్‌ చేశారా !

Hero Vijay Has Target By Political Parties In Tamilnadu - Sakshi

పెరంబూరు : ఇళయదళపతి విజయ్‌ ఇప్పుడు చాలా మందికి టార్గెట్‌ అయ్యారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ నుంచి అవుననే సమాధానం వస్తోంది. సినీ రంగంలో విజయ్‌కు, అజిత్‌కు మధ్య పోటీ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే నిజ జీవితంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఉండడంతో కేవలం వృత్తిపరమైన పోటీనే కాబట్టి సమస్య లేదు. ఈమధ్య అన్నాడీఎంకే పార్టీ విజయ్‌ను టార్గెట్‌ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. నటుడు విజయ్‌ నటించిన తలైవా, కత్తి చిత్రాల విడుదల నుంచి ఆ మధ్య తెరపైకి వచ్చిన సర్కార్, ఇటీవల బిగిల్‌ చిత్ర ఆడియో ఆవిష్కరణ రోజు వరకూ అన్నాడీఎంకే ఆయనను టార్గెట్‌ చేసిందనే టాక్‌ ఉంది .(హీరో విజయ్‌ ఇంట్లో మళ్లీ ఐటీ సోదాలు)

మెర్సెల్‌ చిత్రం విడుదల సమయంలోనూ బీజేపీ నాయకులు ఆ సినిమాను టార్గెట్‌ చేస్తూ.. చిత్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించే విధంగా సంభాషణలు ఉన్నాయంటూ విరుచుకుపడ్డారు. తాజాగా ఆదాయపన్నుశాఖ దాడి.. బిగిల్‌ చిత్ర వ్యవహారంలో ఫిబ్రవరి 5,6 తేదీల్లో విజయ్‌కు చెందిన స్థానిక సాలిగ్రామం, పనైయూర్‌లోని ఇళ్లలో సోదాలు నిర్వహించారు. అప్పుడు ఆయన ఇళ్లలో కొన్ని డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత విజయ్‌కు సమన్లు పంపడం, ఆయన నేరుగా చెన్నైలోని ఆదాయపన్నుశాఖాధికారుల ముందు హాజరై వివరణ ఇవ్వడం జరిగింది. అలాంటిది గురువారం మరోసారి విజయ్‌ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. 

అంతా సక్రమమే 
ఈ సందర్భంగా నటుడు విజయ్‌ తాజాగా నటిస్తున్న మాస్టర్‌ చిత్ర సహ నిర్మాత లలిత్‌కుమార్‌ ఇంట్లోనూ సోదాలు నిర్వహించారు. కాగా విజయ్‌ బిగిల్‌ చిత్రంలో నటించినందుకు గాను రూ.50 కోట్ల పారితోషికాన్ని, తాజాగా నటిస్తున్న మాస్టర్‌ చిత్రానికి రూ.80 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు తేలింది. ఈ రెండు చిత్రాల పారితోషికానికి నటుడు విజయ్‌ సక్రమంగా పన్ను చెల్లించినట్లు ఆదాయశాఖ అధికారులు సర్టిఫికెట్‌ ఇచ్చారు. ఆయన్ని మిస్టర్‌ క్లీన్‌గా చేశారు. ఈ ఐటీ దాడుల వ్యవహారంలో విజయ్‌ ప్రవర్తించిన తీరు ఆయన పరిణితిని తెలియజేసింది. ఈ దాడుల గురించి ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
(విషం ఇచ్చి చంపేయమంటున్నారు! )

కాగా ఐటీ అధికారులు విజయ్‌కు క్లీన్‌ చిట్‌ ఇవ్వడంతో సినీ నటి, కాంగ్రెస్‌స్‌ పార్టీ జాతీయ ప్రచార కర్త ఖష్భూ స్పందించారు. 'ఆదాయపు పన్ను శాఖ అధికారులు విజయ్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చారు కాబట్టి ఇక ఈ వ్యవహారానికి విశ్రాంతి ఇచ్చేద్దామా? ' అని ట్విటర్‌లో  పేర్కొన్నారు. విజయ్‌ తన పనిని తాను కామ్‌గా చేసుకుపోతున్నారు. ప్రస్తుతం నటిస్తున్న మాస్టర్‌ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్రం ఏప్రిల్‌ 9వ తేదీన తెరపైకి రానుంది. ఈ చిత్ర విడుదలకు ఎలాంటి సమస్యలు ఎదురవుతాయోనన్న చర్చ కోలీవుడ్‌ వర్గాల్లో జరుగుతోంది. త్వరలో తాను నటించనున్న కొత్త చిత్రం గురించి వెల్లడించనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top