
చెన్నైలో స్టార్ క్రికెట్ సందడి
క్రికెట్ మైదానంలో దక్షిణ భారత సినిమా స్టార్లు తళుక్కుమన్నారు.
ఫైనల్లో సూర్య జట్టు గెలుపు
చెన్నై: క్రికెట్ మైదానంలో దక్షిణ భారత సినిమా స్టార్లు తళుక్కుమన్నారు. దక్షిణ భారత నటీనటుల సంఘం ఆధ్వర్యంలో చెన్నైలో ఆదివారం స్టార్స్ క్రికెట్ నిర్వహించారు. ఇక్కడి చెపాక్ స్టేడియంలో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగిన మ్యాచ్లకు దక్షిణాది రాష్ట్రాల నుంచి సినీ నటీనటులు తరలివచ్చారు. సూపర్స్టార్ రజనీకాంత్ సమక్షంలో విశ్వనటుడు కమలహాసన్ తొలిమ్యాచ్కు టాస్ వేసి స్టార్స్ క్రికెట్ క్రీడాపోటీలను ప్రారంభించారు.
ఆరంభం నుంచి ఫైనల్ మ్యాచ్ వరకు రసవత్తరంగా జరిగిన పోటీల్లో ఎనిమిది జట్లు తలపడ్డాయి. ఈ సందర్భంగా విలక్షణ నటుడు విక్రమ్ పుట్టినరోజును సంబరంగా జరుపుకున్నారు. మమ్ముట్టితోపాటు నాజర్, విశాల్, బాలకృష్ణ, శ్రీయ తదితరులు కేక్ను విక్రమ్కు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్స్లో సూర్య చెన్నై సింగమ్స్ జట్టు, జీవా తంజై వారియర్స్ జట్లు తలపడగా హోరాహోరీగా జరిగిన పోటీలో సూర్య చెన్నై సింగమ్స్ జట్టు విజయకేతనం ఎగురవేసింది. పోటీలకు అక్కినేని నాగార్జున హాజరయ్యారు.