ప్రముఖ సినీ గీతరచయిత కన్నుమూత
సాక్షి, చెన్నై : సినీ గీతరచయిత ముత్తువిజయన్ శుక్రవారం సాయంత్రం చెన్నైలో కన్నుమూశారు. పలువురు ప్రముఖ నటుల చిత్రాలకు పాటలు రాసిన ముత్తువిజయన్, నటుడు విజయ్ నటించిన తుళ్లాద మనం తుళ్లుం చిత్రం ద్వారా గీత రచయితగా పరిచయం అయ్యారు. అందులో మెఘామాయ్ వందు పోగిరేన్, విన్నిలా ఉన్నైతేడినేన్ పాటలు ముత్తువిజయన్కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆ తరువాత పెన్నిన్మనదై తొట్టు చిత్రంలో కన్నుకుళ్లే ఉన్నై వైత్తేన్ పాట ముత్తువిజయన్ను మరింత పాపులర్ చేసింది. ఈయన 800లకు పైగా పాటలు రాసిన ముత్తుకుమార్ మాటల రచయితగానూ, సహాయ దర్శకుడిగానూ పనిచేశారు.
కవయిత్రి తేన్మొళిని ప్రేమవివాహం చేసుకున్నారు. అయితే కొంతకాలానికే వీరిద్దరూ విడిపోయారు. స్థానిక వలసరవాక్కంలోని సినీ గీత రచయితల సంఘ కార్యాలయంలోనే బసచేస్తున్న ముత్తువిజయన్ పచ్చ కామెర్ల బారిన పడడంతో కాలేయం దెబ్బతింది. అందుకు వైద్య చికిత్స పొందుతున్న ముత్తువిజయన్ శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈయన అంత్యక్రియలు అదే రోజు సాయంత్రం వలసవాక్కం శ్మశాన వాటికలో జరిగాయి.