అవసరమైతే కోర్టుకి వెళతాను | Dandupalyam 4 producer Venkat to approach the tribunal | Sakshi
Sakshi News home page

అవసరమైతే కోర్టుకి వెళతాను

Feb 3 2019 5:25 AM | Updated on Feb 3 2019 5:27 AM

Dandupalyam 4 producer Venkat to approach the tribunal - Sakshi

వెంకట్, కేటీ నాయక్‌

బెనర్జీ, వెంకట్, ముమైత్‌ఖాన్, సంజీవ్‌ కుమార్, సుమన్‌ రంగనాథన్‌ ప్రధాన పాత్రధారులుగా కేటీ నాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం ‘దండుపాళ్యం 4’. వెంకట్‌ నిర్మించారు. ఈ సినిమాను మార్చిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా వెంకట్‌ మాట్లాడుతూ– ‘‘మా దండుపాళ్యం 4’ చిత్రానికి ఇంతకుముందు వచ్చిన దండుపాళ్యం ట్రయాలజీకి ఎలాంటి సంబంధం లేదు. జైలులో ఉన్న తమ సహచరులను తప్పించడానికి ఓ దండు ఎలాంటి వ్యూహాలు రచించింది? పోలీసులు ఎలాంటి ఎత్తుగడలు వేశారు? అనే అంశాలతో మా ‘దండుపాళ్యం 4’ రూపొందింది.

ఇందులో ఏడుగురు ఉన్న గ్యాంగ్‌కు నాయకురాలిగా సుమా రంగనాథన్‌ నటించారు’’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ– ‘‘షూటింగ్‌ పూర్తయిన మా సినిమాను సెన్సార్‌కు అప్లై చేశాను. కంటెంట్‌ పరంగా సినిమాలో ఏదైనా సమస్య ఉంటే ఫలానా సన్నివేశాన్ని, ఫలానా డైలాగ్‌ని తొలగించడం జరుగుతుంది. నా సినిమాను చూసిన సెన్సార్‌ బోర్డ్‌ ఆఫీసర్‌ సినిమాలో కొన్ని సీన్లు తొలగించాలి, లేకుంటే రిజెక్ట్‌ చేస్తానని అన్నారు. సినిమాలో ఉన్న సమస్య ఏంటో చెప్పకండా రిజెక్ట్‌ చేస్తాననడం మొదటిసారి చూశా.

ఆ తర్వాత ఆయన ఈ సినిమాను సెన్సార్‌ చేయను. రివైజింగ్‌ కమిటీకి వెళ్లండన్నారు. ప్రస్తుతం నేను అదే పని మీద ఉన్నాను. రివైజింగ్‌ కమిటీనే కాదు... ట్రిబ్యునల్‌.. అదీ కాకపోతే కోర్టుకి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చిలో మా సినిమాను విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మా సినిమాతో సెన్సార్‌ బోర్డుకి ఇబ్బంది ఏంటో అర్థం కావడం లేదు. సినిమా బాగా వచ్చింది. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సినిమాను మార్చిలో విడుదల చేస్తాం’’ అన్నారు దర్శకుడు. ముత్యాల రాందాసు, బెనర్జీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement