దేశవ్యాప్తంగా తన సినిమాలకు వస్తున్న ఆదరణకు ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పేర్కొన్నారు. తాజాగా ఆయన నటించిన సరైనోడు, డీజే హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్లో మిలియన్లకొద్దీ వ్యూస్తో దూసుకుపోతున్నాయి. ఈ సందర్భంగా అల్లు అర్జున్ ట్విటర్లో స్పందిస్తూ 'నా సినిమాలపై మీరు చూపిస్తున్న అభిమానానికి ఫిదా అయ్యాను. మీ ఆదరాభిమానాలు ఎల్లప్పుడు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. నా సినిమాలు ప్రాంతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది’ అని పేర్కొన్నారు. అభిమానులు చూపిస్తున్న అభిమానానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ, రాబోయే రోజుల్లో మరిన్ని మంచి సినిమాలు అందించడానికి ప్రయత్నిస్తానని తెలిపారు.
బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన సరైనోడు, హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన డీజే హిందీ డబ్బింగ్ సినిమాలు యూట్యూబ్లో 200,150 మిలియన్లకుపైగా వ్యూస్ వచ్చాయి. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి మంచి హిట్ సినిమాలుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో తాజాగా రూపొందుతున్న చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.