మరోసారి తెరమీదకు మెగా మల్టీస్టారర్.!
మెగా స్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ల కాంబినేషన్లో ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు చాలా రోజులుగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. సుబ్బిరామి రెడ్డి లాంటి వారు ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా ప్రకటించినా.. ఇంత వరకు పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఈ మెగా ప్రాజెక్ట్కు సంబంధించి నిర్మాత అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తేజ్ ఐ లవ్ యు సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న అల్లు అరవింద్ తొలిప్రేమ సినిమా సమయంలో జరిగిన సంఘటన వివరించారు. తొలిప్రేమ షూటింగ్ సమయంలో సెట్ వెళ్లిన అరవింద్ చిరు, పవన్ల కాంబినేషన్లో మల్టీస్టారర్ చేయాలనుకుంటున్నా అది నువ్వే డైరెక్ట్ చేయాలని దర్శకుడు కరుణాకరన్కు చెప్పారట. అయితే కరుణాకరన్ మాత్రం అంతటి బాధ్యతను తాను మోయలేని భయపడిపోయాడన్నారు అరవింద్. ఈసందర్భంగా ఎప్పటికైన వారిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమాను తానే నిర్మిస్తానని వెల్లడించారు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా నరసింహారెడ్డి సినిమా పనుల్లో బిజీగా ఉండగా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. మరి వీరిద్దరి కాంబినేషన్ను అరవింద్ ఎప్పటికీ.. ఎలా సెట్ చేస్తారోచూడాలి.