చంద్రబాబు అవినీతిపై అమెరికాలో ప్రచారం | Ysrcp to campaign on chandrababu naidu's corruption in america | Sakshi
Sakshi News home page

చంద్రబాబు అవినీతిపై అమెరికాలో ప్రచారం

May 1 2016 7:14 PM | Updated on Aug 27 2019 4:45 PM

చంద్రబాబు అవినీతిపై అమెరికాలో ప్రచారం - Sakshi

చంద్రబాబు అవినీతిపై అమెరికాలో ప్రచారం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్పడుతున్న అవినీతిపై అమెరికాలో వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది.

‘ఎంపరర్ ఆఫ్ కరప్షన్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన గడికోట
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్పడుతున్న అవినీతిపై అమెరికాలో వైఎస్సార్‌సీపీ పెద్ద ఎత్తున ప్రచారాన్ని చేపట్టింది. అక్కడ నివసిస్తున్న ప్రవాస భారతీయులుకు రాష్ట్రంలో రాజధాని నిర్మాణం పేరుతో సాగుతున్న అవినీతిని, అక్రమాలను వివరిస్తోంది. అమెరికా పర్యటనలో ఉన్న వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల కోఆర్డినేటర్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి శనివారం షెర్లాట్ నగరంలో జరిగిన ఒక కార్యక్రమంలో ప్రవాసుల మధ్య ‘ఎంపరర్ ఆఫ్ కర ప్షన్’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. వాషింగ్టన్ డీసీ, షికాగో, డల్లాస్, డెట్రాయిట్ నగరాల్లో కూడా పర్యటించి ప్రవాసుల మధ్య ఈ పుస్తకాన్ని విడుదల చేస్తామని గడికోట పేర్కొన్నారు. చంద్రబాబు ఏ రకంగా అవినీతికి పాల్పడుతున్నారో ఈ పుస్తకంలో సవివరంగా తెలియజేశామని తెలిపారు. ఏపీలో చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తున్నారని, శాసనసభ్యులను ప్రలోభాలకు గురిచేసి కొనుగోలు చేస్తున్నారని రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని శ్రీకాంత్ విమర్శించారు.
 
జలీల్‌ఖాన్ ఆరోపణలు ఓ మైండ్ గేమ్
అధికారపక్షంలోకి ఫిరాయించిన జలీల్‌ఖాన్ తాను కూడా వస్తున్నానంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీ మైండ్‌గేమ్‌లో భాగమని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. తాను పదిరోజులుగా కనపడలేదని టీడీపీలోకి వెళతానని మీడియాకు చెప్పడం అభ్యంతరకరమని ఆయన అన్నారు. తాను ప్రతిరోజూ టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తల వద్ద హాజరు వేయించుకోవాలా? అని గడికోట ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము వ్యక్తిత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే వాళ్లమని, పదవులకో ప్రలోభాలకో పార్టీలు మారే వాళ్లం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ జన్మ ఉన్నంత కాలం తాను వైఎస్సార్‌సీపీలోనే ఉంటానని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో పని చేస్తానని ఆయన అన్నారు. టీడీపీ వారు దురుద్దేశ్యంతో ఇలా బురద జల్లడం మానుకోవాలని ఆయన హితవు చెప్పారు. ఈ కార్యక్రమం వైఎస్సార్‌సీపీ కన్వీనర్ రత్నాకర్ ఆధ్వర్యంలో జరిగింది.

Advertisement
 
Advertisement
Advertisement