మాలిలో ఉగ్రదాడి.. 35మంది జవాన్ల మృతి

Terrorist Attack On Mali Military Post Kills 35 Soldiers - Sakshi

బమాకో (మాలి) : వైశాల్యపరంగా ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా పిలవబడుతున్న మాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. మాలిలోని మేన‌క ఔట్‌పోస్టు ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారుగా 35 మంది సైనికులు మృతి చెందారు. ప్ర‌స్తుతం అక్క‌డ ప‌రిస్థితులు అదుపులో ఉన్న‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. గతంలో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా అనేక మంది సైనికులు మరణించారు.

ఇటీవ‌లే ఓ నెల రోజుల క్రితం బుర్కినో ఫాసోలో ఇద్ద‌రు జిహాదీలు చేసిన దాడిలో సుమారు 40 మంది సైనికులు మృతిచెందారు. అయితే శుక్ర‌వారం జ‌రిగిన దాడికి సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సంస్థ బాధ్య‌త ప్ర‌క‌టించ‌లేదు. ఉత్త‌ర మాలి ప్రాంతంలో ఆల్‌ ఖైదా ఉగ్ర‌వాదులు ఆధిప‌త్యం చెలాయిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ ద‌ళాలు చేప‌ట్టిన ఆప‌రేష‌న్‌తో ఉగ్ర‌వాదులు ప్ర‌తిదాడుల‌కు దిగుతున్నారు. 2016లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 2018లో 40మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2015లో మాలి రాజధాని బమాకో నగరం మధ్య ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు 18మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top