భారత్‌ అనుమతినిచ్చింది: మలేషియా

Report Says India Agrees To Sell Key Drug To Malaysia Amid Covid 19 - Sakshi

కౌలలంపూర్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌(కోవిడ్‌-19)ను కట్టడి చేసే హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను తమకు విక్రయించేందుకు భారత్‌ అంగీకరించిందని మలేషియా మంత్రి కౌముర్దీన్‌ జాఫర్‌ పేర్కొన్నారు. ‘‘ఏప్రిల్‌ 14న మలేషియాకు 89,100 టాబ్లెట్లు ఎగుమతి చేసేందుకు భారత్‌ అనుమతినిచ్చింది. మరిన్ని టాబ్లెట్లు తెప్పించునేందుకు మేం ప్రయత్నిస్తున్నాం. హైడ్రాక్సీక్లోరోక్విన్‌ లభ్యతపై ఈ విషయం ఆధారపడి ఉంటుంది’’అని రాయిటర్స్‌కు వెల్లడించారు. అయితే భారత ప్రభుత్వం ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి ప్రకటన చేయలేదు. (అమెరికా నిర్ణయం ఆందోళనకరం: చైనా)

కాగా మలేషియాలో కరోనా తీవ్ర ప్రభావం చూపుతోంది. అక్కడ ఇప్పటికే 82 మంది ఈ మహమ్మారికి బలికాగా.. 5 వేల మంది దీని బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిలో సత్పలితాలు ఇస్తున్నట్లు భావిస్త్ను యాంటీ మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను ఎగుమతి చేయాల్సిందిగా మలేషియా భారత్‌ను అభ్యర్థించింది. ఇక ఇప్పటికే అమెరికా, ఇజ్రాయెల్‌, మాల్దీవులు తదితర దేశాలకు భారత్‌ ఈ టాబ్లెట్లను సరఫరా చేసిన విషయం తెలిసిందే.(6.2 టన్నులు.. భారత్‌కు ధన్యవాదాలు)

కాగా గడిచిన కొన్ని నెలలుగా నరేంద్ర మోదీ సర్కారు తీసుకున్న పలు కీలక నిర్ణయాలను మలేషియా మాజీ ప్రధాని మహతీర్‌ విమర్శించిన విషయం తెలిసిందే. కశ్మీర్‌ను ఆక్రమిత ప్రాంతంగా పేర్కొన్నడం సహా.. ఆర్టికల్‌ 370 రద్దు విషయంలో భారత్‌పై విమర్శలు గుప్పించారు. అదే విధంగా పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) కూడా ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో  ప్రపంచంలోనే పామాయిల్‌ అతిపెద్ద దిగుమతిదారుగా ఉన్న భారత్‌... మలేషియా పామాయిల్‌ను కొనుగోలు చేయకూడదని నిర్ణయించింది. అయితే వాణిజ్యపరంగా ఇరు దేశాల మధ్య విభేదాలు త్వరలోనే సమసిపోతాయని మలేషియా మంత్రి పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అత్యవసర సమయంలో మందులు సరఫరా చేసేందుకు భారత్‌ అంగీకరించడం గమనార్హం.(త్వరలోనే అన్ని సమస్యలు సమసిపోతాయి: మలేషియా మంత్రి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top