వ్యాపారవేత్త పెద్దమనసు.. ఉద్యోగులకు వరాలు!

NRI Businessman Charters Flight For Employees From UAE to Kerala - Sakshi

ఉద్యోగుల కోసం ప్రత్యేక విమానం.. యూఏఈ నుంచి భారత్‌కు..

‘‘కష్టసుఖాల్లో నాకు తోడున్న ఉద్యోగులను కాపాడుకోవడం నా బాధ్యత. నా విజయవంతమైన ప్రయాణంలో భాగస్వామ్యమైన వారికి ఈ విధంగా కృతజ్ఞతలు చెప్పుకొనే అవకాశం లభించింది. మా సంస్థలో పనిచేసే వాళ్లు కూడా మా కుటుంబ సభ్యులే. నిజానికి వాళ్లు బాగుంటేనే సంస్థ బాగుంటుంది. వారు కష్టాల్లో ఉంటే నేనెలా చూస్తూ ఊరుకోగలను. నా కర్తవ్యాన్ని నేను నెరవేర్చాను అంతే’’ అంటూ ఆర్‌. హరికుమార్‌ అనే వ్యాపారవేత్త పెద్ద మనసు చాటుకున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో చిక్కుకుపోయిన తన కంపెనీ ఉద్యోగులను ప్రత్యేక విమానంలో భారత్‌కు పంపించారు. కోవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వారి ఆకాంక్షను నెరవేర్చారు. (పాక్‌లో భారత అధికారులు మిస్సింగ్‌)

అంతేకాదు నెల జీతం బోనస్‌గా ఇవ్వడంతో పాటుగా వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక బహుమతులు కూడా పంపించారు. అదే విధంగా తిరిగి యూఏఈకి వెళ్లేందుకు ఇష్టపడని వాళ్లు తమిళనాడులోని కోయంబత్తూరులో గల ప్లాంట్‌లో పనిచేసే వీలు కల్పించారు. సంస్థ కోసం శ్రమంచిన తమ కష్టాన్ని గుర్తించి.. వారికి అండగా నిలబడిన హరికుమార్‌పై ఉద్యోగులు ప్రశంసలు కురిపిస్తున్నారు. వివరాలు.. కేరళలోని అలప్పుళకు చెందిన హరికుమార్‌ థియేటర్‌ ఆర్టిస్టు. 20 ఏళ్ల క్రితం ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన ఆయన.. తదనంతర కాలంలో గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగారు. (పిల్ల బంట్లు.. న్యాయపోరాటం)

ఈ క్రమంలో భవన నిర్మాణరంగం, ఇతర రంగాల్లో వ్యాపారాన్ని విస్తరించి ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వ్యాపార సంస్థల్లో పనిచేసే ఉద్యోగులను సొంత మనుషుల్లా భావించే కుమార్‌.. యూఏఈలో ఉండిపోయిన 120 మంది ఉద్యోగులను కొచ్చి పంపేందుకు ప్రత్యేక విమానం బుక్‌ చేశారు. కేవలం వారే కాకుండా భారత్‌కు వెళ్లేందుకు టికెట్లు దొరక్క కష్టాలుపడుతున్న మరో 50 మంది ప్రవాస భారతీయుల కోసం కూడా టికెట్లు కొన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 170 మందితో షార్జా నుంచి బయల్దేరిన విమానం ఆదివారం రాత్రి కొచ్చి ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది. 
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top