టాప్ టీంలోకి నారాయణమూర్తి అల్లుడు
లండన్ : ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి అల్లుడు రిషి సునక్కు కీలక పదవి దక్కింది. బ్రిటన్ ప్రభుత్వంలోకి ఆయనను మంత్రిగా తీసుకున్నారు. సోమవారం బ్రిటన్ ప్రధాన మంత్రి థెరిసా మే తన కేబినెట్ పునర్వ్యస్థీకరణ చేపట్టారు. అందులో భాగంగా తన టాప్ కేబినెట్ టీంలోకి నారాయణ మూర్తి అల్లుడు, ఎంపీ అయిన రిషిని తీసుకున్నారు.
ఆయనకు బ్రిటన్ హౌజింగ్, కమ్యునిటీస్, లోకల్ గవర్నమెంట్ వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. ఆయన కేబినెట్ మంత్రి హోదాలో తన విధులు నిర్వర్తించనున్నారు. ఈ మేరకు మంగళవారం రాత్రి థెరిసామే కార్యాలయం నుంచి ఓ ట్వీట్ వెలువరించారు. 'బ్రిటన్ హౌజింగ్, కమ్యునిటీస్, లోకల్ గవర్నమెంట్ వ్యవహారాల మంత్రిగా ఎంపీ రిషి సునక్ బాధ్యతలు నిర్వర్తిస్తారు. కిందిస్థాయి మంత్రిత్వ హోదాలకు పెద్ద మొత్తంలో మహిళలను, మైనారిటీ నాయకులను ఎంపిక చేయడం జరిగింది. దేశ ప్రజలకు చేరువయ్యేలా మరిన్ని సేవలు అందించేందుకు థెరిసామే ఈ నిర్ణయం తీసుకున్నారు' అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు.