జపాన్, బ్రిటన్ నిర్ణయం
టోక్యో: సైబర్ సెక్యూరిటీతోపాటు అరుదైన ఖనిజాల సరఫరాలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని, పరస్పరం కలిసి పని చేయాలని జపాన్, బ్రిటన్ నిర్ణయించుకున్నాయి. బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ శనివారం జపాన్లో పర్యటించారు. జపాన్ ప్రధాని సనే తకాయిచీతో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక అంశాలపై చర్చించారు. జపాన్, బ్రిటన్ సంబంధాలతోపాటు ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై అభిప్రాయాలు పంచుకున్నారు.
అనంతరం ఇరువురు నేతలు మీడియాతో మాట్లాడారు. అట్లాంటిక్, ఇండో–పసిఫిక్లో సహకారం, భద్రతపై తకాయిచీతో చర్చించినట్లు స్టార్మర్ తెలిపారు. తమ ఆర్థిక వ్యవస్థలను కాపాడుకోవడానికి సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని నిర్ణయించామని, ఇందుకోసం కలిపి పనిచేస్తామని చెప్పారు. ఇందుకోసం కొత్తగా సైబర్ సెక్యూరిటీ వ్యూహాత్మక బాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మరోవైపు అరుదైన ఖనిజాల విషయంలో బ్రిటన్తో పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.


