ఒక రోజు నిద్రపోకపోతే ఏం జరుగుతుందో తెలుసా... 

Insufficient Sleep Affects Our DNA - Sakshi

నిద్రలేమి కారణంగా ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని మనందరికీ తెలుసు కానీ ఆ పరిణామాలు మనం ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఒక రోజు నిద్ర పోకపోయినా సమస్యలు తీవ్రంగా ఉంటాయని చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా మానవ డీఎన్‌ఏలో మార్పులు చోటుచేసుకుంటాయని హాంకాంగ్‌కు చెందిన ష్యు వేయ్‌ చాయ్‌ అనే శాస్త్రవేత్త పేర్కొన్నారు. ఆరోగ్యవంతులైన 49మందిపై జరిపిన పరిశోధనలో రాత్రి వేళలో పనులు చేస్తున్న వారిలో శరీరం డీఎన్‌ఏను మరమ్మత్తు చేయటంలో విఫలమైనట్లు గుర్తించారు. కేవలం ఒక రాత్రి మేలుకోవటం కారణంగా వారి డీఎన్‌ఏ తీవ్రంగా దెబ్బతిన్నట్లు కనుగొన్నారు. ఒక రోజు నిద్రను కోల్పోవటం కారణంగా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని చాయ్‌ వెల్లడించారు.  

మనసు పెట్టి తింటేనే మంచిది... 


ఉరుకుల పరుగు జీవితం... వేళకు ఏదో గబాగబా తినేసి కానిచ్చేద్దాం అంటే సమస్యలు తప్పవు. భోజనం మీద మనసు లగ్నం చేయడం వల్ల శరీరానికి పోషకాలు సరిగ్గా అందుతాయని, ఆరోగ్యకరమైన బరువుతో ఉంటారని, మానసిక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుందని చెబుతున్నారు పరిశోధకులు. ఇటీవల బరువు తగ్గేందుకు డైట్‌ పాటిస్తున్న 53 మందిపై ఆరు నెలలుగా అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో వెల్లడైన ఆసక్తికర విశేషాలేమంటే... 6 నెలల్లో మైండ్‌ఫుల్‌ ఈటింగ్‌కు సంబంధంచి మూడు, నాలుగు సెషన్స్‌కు హాజరైన వారు సగటున 3 కిలోల బరువు తగ్గారట. ఒకటి, రెండు సెషన్లకు వచ్చినవారు కిలో మాత్రమే తగ్గారట. 

పండుగలు, సెలవురోజుల్లో కుటుంబం, స్నేహితులతో కలిసి వివిధ రకాల ఆహారపదార్థాలను కడుపునిండా లాగించేస్తాం. తీరా బరువు పెరిగి, మునుపటి షేప్‌లోకి వచ్చేందుకు కసరత్తులు, నానా కష్టాలు పడతాం. అయితే ఈ సమస్యకు సులువైన పరిష్కారం చెబుతున్నారు పరిశోధకులు. మనసుపెట్టి పనిచేయడం వల్ల ఉద్రేకం తగ్గి, ఆలోచనల మీద గురి ఉంటుంది. ఒత్తిడి తగ్గి, అదనపు శక్తి సమకూరి, రెట్టించిన ఉత్సాహం సొంతమవుతుంది. అదేవిధంగా మనసుపెట్టి తినడం వల్ల ఆహారాన్ని సంతృప్తిగా తినడం అలవడుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి కూడా పటిష్ఠమవుతుందంటున్నారు పరిశోధకులు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top