వారంలో రెండుసార్లు దిగ్గజ నేతల భేటీ

Indian Envoy Confirms PM Modi Donald Trump To Meet Twice Next Week   - Sakshi

వాషింగ్టన్‌ : ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ రానున్న వారంలో రెండు సార్లు భేటీ కానున్నారని అమెరికాలో భారత రాయబారి నిర్ధారించారు. భారత్‌-అమెరికా వ్యూహాత్మక సంబంధాలు ఈ శతాబ్ధంలోనే వినూత్న భాగస్వామ్యం దిశగా సాగనున్నాయని చెప్పారు. ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ సదస్సుకు ప్రధాని మోదీ వచ్చే వారం రానున్న క్రమంలో అగ్రనేతలు ఇరువురూ రెండు సార్లు సమావేశం కానున్నారని భారత రాయబారి హర్ష వర్ధన్‌ ష్రింగ్లా పేర్కొన్నారు.

మోదీ, ట్రంప్‌ ఈనెల 22న భేటీ అవుతారని, హోస్టన్‌లో జరిగే భారతీయుల సమ్మేళనానికి మోదీతో కలిసి ట్రంప్‌ పాల్గొంటారని, న్యూయార్క్‌లో జరిగే ఐరాస సమావేశాల నేపథ్యంలోనూ వారిద్దరి మధ్య ముఖాముఖి ఉంటుందని ఆయన వెల్లడించారు. కాగా జపాన్‌లో జీ20, ఫ్రాన్స్‌లో జీ 7 సదస్సుల సందర్భంగా అగ్రనేతలు ఇటీవల రెండు సార్లు భేటీ అయిన సంగతి తెలిసిందే. దీంతో కొద్ది నెలల వ్యవధిలోనే ఇరు నేతల మధ్య నాలుగు సమావేశాలు సాగినట్టవుతుందని ష్రింగ్లా వ్యాఖ్యానించారు. ఇక శనివారం హోస్టన్‌కు చేరుకునే ప్రధాని మోదీ మరుసటి రోజు హోస్టన్‌లో 50,000 మందికి పైగా ఇండో అమెరికన్లు పాల్గొనే హౌదీ మోదీ కార్యక్రమంలో పాల్గొంటారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top