చైనాలో ముద్దుల పోటీ.. మండిపడుతున్న నెటిజన్లు

A Furniture Factory Conducts Kissing Contest In China - Sakshi

ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ చైనాలోని ఓ ఫ్యాక్టరీ చేసిన పనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువడుతున్నాయి. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగమైన భౌతిక దూరం నిబంధనను ఉల్లంఘిస్తూ సుజౌ నగరంలోని యుయా ఫర్నిచర్ ఫ్యాక్టరీ కిస్సింగ్‌ పోటీని నిర్వహించింది. ఆ పోటీలో పాల్గొనే వారు ప్లెక్సీగ్లాస్‌తో వేరు చేయబడి.. ఒకరినొకరు కిస్‌ చేసుకున్నారు.

ఇందుకోసం ఆ ఫ్యాక్టరీ పది జంటలను ఎంపిక చేసింది. అయితే ఈ కిస్సింగ్‌ పోటీలో పాల్గొనేవారు.. ముద్దు పెట్టుకునే క్రమంలో వారు తమ ఫేస్‌ మాస్క్‌లను తొలగించారు. ఇందుకు సంబంధించిన పోటోలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ ఫ్యాక్టరీ చర్యను తప్పుబడుతూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కాగా, చైనాలో లాక్‌డౌన్‌ సమయంలో విధించిన అంక్షలు ఎత్తివేయడంతో ఆ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించారు. అయితే చాలా రోజుల తర్వాత ఫ్యాక్టరీలో పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఈ పోటీని నిర్వహించినట్టుగా తెలుస్తోంది. 

ఇన్ఫెక్షన్‌ తీవ్రతను తగ్గించడానికి జంటల మధ్య ప్లెక్సీగ్లాస్‌ ఉంచడం జరిగిందని ఆ ఫ్యాక్టరీ యజమాని చెప్పారు. పోటీదారుల్లో కొన్ని జంటలు(భార్య, భర్త ఇద్దరు) తమ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నట్టు చెప్పారు. కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురిచేసిందని.. ఫ్యాక్టరీలో ప్రతి ఒక్కరిని సంతోష పెట్టడానికే ఈ పోటీని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top