విమానం ఎక్కుతూ బామ్మ ఎంతపనిచేసింది?

విమానం ఎక్కుతూ బామ్మ ఎంతపనిచేసింది?

షాంఘై: చైనాలో ఓ పెద్దావిడ చేసిన పనికి బయల్దేరాల్సిన విమానాన్ని హఠాత్తుగా ఆపేశారు. అప్పటి కప్పుడు విమానం ఇంజిన్‌ను విప్పదీసి మరమ్మత్తు చేసినంత పనిచేశారు. దాంతో కొన్ని గంటలు ఆలస్యంగా ఆ విమానం బయల్దేరాల్సి వచ్చింది. ఆ పని చేసిన బామ్మను అరెస్టు చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఆ బామ్మ చేసిన పని ఏమిటని అనుకుంటున్నారా? మరేం లేదు విమానం ఎక్కేందుకు వెళ్లి తాఫీగా ఇంజిన్‌లోకి ఓ తొమ్మిది నాణాలను విసిరేసింది. ఇది చూసిన ఓ ప్రయాణీకుడు సిబ్బందికి చెప్పడంతో ఈ తంతు మొదలైంది. వివరాల్లోకి వెళితే..



షాంఘై పుడోంగ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చైనా విమానం సీజెడ్‌ 380 గాంగ్జౌ పట్టణానికి బయల్దేరేందుకు సిద్ధంగా ఉంది. గాంగ్జౌకు వెళ్లేందుకు ఓ 80 ఏళ్ల బామ్మ ఆమె భర్త, కూతురు, అల్లుడు కలిసి విమానం ఎక్కేందుకు వచ్చారు. ఆమెకు అతీతశక్తులమీద బాగా నమ్మకం. దీంతో తమకు ఎలాంటి హానీ జరగకుండా ఉండాలనే ఉద్దేశంతోపాటు తనకు కలిసి వస్తుందని ఒక తొమ్మిది నాణాలను విమానం ఇంజిన్‌లోకి విసిరేయడంతో అది చూసిన ఓ ప్యాసింజర్‌ సిబ్బందికి చెప్పగా విమానాన్ని ఆపేశారు.



అందులో అప్పటికే ఎక్కి కూర్చున్న 150మందిని ఉన్నపలంగా దింపేశారు. దాదాపు తొలుత ఇంజిన్‌ భాగాన్ని తీసి వెతగ్గా ఎనిమిది నాణాలు మాత్రం లభించాయి. మరో నాణం దొరక్కపోవడంతో ఇంజిన్‌ భాగాన్ని విప్పదీసి చూడగా అందులో ఇరుక్కుపోయి కనిపించింది. దీంతో ఊపిరి పీల్చుకున్నారు. చివరకు నాణాన్ని తొలగించి విమానాన్ని సిద్ధం చేసి పంపించారు. బామ్మని కుటుంబ సభ్యులను మాత్రం అదుపులోకి తీసుకున్న చైనా పోలీసులు విచారిస్తున్నారు. 


 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top