చంద్రబాబు మైండ్సెట్ మారాలి: వైఎస్ జగన్ | ys jagan mohan reddy takes on chandrababu niadu | Sakshi
Sakshi News home page

చంద్రబాబు మైండ్సెట్ మారాలి: వైఎస్ జగన్

Apr 14 2016 12:04 PM | Updated on May 29 2018 4:26 PM

చంద్రబాబు మైండ్సెట్ మారాలి: వైఎస్ జగన్ - Sakshi

చంద్రబాబు మైండ్సెట్ మారాలి: వైఎస్ జగన్

దళితుల విషయంల చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం మైండ్ సెట్ మారాలని ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.

హైదరాబాద్: దళితుల విషయంలో చంద్రబాబు నాయుడు, ప్రభుత్వం మైండ్ సెట్ మారాలని ప్రతిపక్షనేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బీఆర్ అంబేద్కర్ 125 జయంతి వేడుకలు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ స్ఫూర్తిని అందరూ కొనసాగించాలన్నారు. అట్టడుగు వర్గాల వారికి న్యాయం జరగాలని అంబేద్కర్ కృషి చేశారని, అయితే ప్రభుత్వం మాత్రం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ను తుంగలో తొక్కుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రకారం నిధులు ఖర్చు చేయకుండా చంద్రబాబు రాజ్యాంగాన్ని అవమానపరుస్తున్నారని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు.

వైఎస్ జగన్ ఇంకా ఏంమాట్లాడారంటే...అంబేద్కర్ స్ఫూర్తిని మనం కొనసాగించాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ గుర్తుచేస్తున్నా. ఆయన నోట్లోంచి వచ్చిన మాటలు కొద్దిగా అటు ఇటుగా చూస్తే.. 'ఎన్నాళ్లు బతికామన్నది కాదు, బతికినంత కాలం ఎంత గొప్పగా బతికామన్నది ముఖ్యం'. ఆయన చెప్పినమాటల్లో ఇది ముఖ్యమైనది. అదే చాలా విషయాలు చెబుతుంది. ఈవాళ మన రాష్ట్రంలో అంబేద్కర్‌గారిని ఆయన జయంతి, వర్ధంతి రోజుల్లో గుర్తుచేసుకుంటాం గానీ, ఆయన స్ఫూర్తిని పాలకులు మర్చిపోవడం చూస్తుంటే బాధ అనిపిస్తుంది.

ఇప్పటికైనా పాలకులు ఆ స్ఫూర్తిని మర్చిపోకుండా అమలు చేయాలని కోరుతున్నా. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ద్వారా అట్టడుగు వర్గాలకు మేలు జరుగుతుందని ఆయన ఆశించారు. కానీ న్యాయం జరగడం లేదు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు జనాభా ప్రకారం వాళ్లకు కేటాయించి ఖర్చుచేయాలని చట్టబద్ధత తెస్తే, చట్టసభల్లో ఆ నిధులు ఖర్చుచేయకుండా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు. కాగ్ తన నివేదికలలోనే ఈ విషయాన్ని తప్పుపడుతోందంటే అంత దుర్మార్గంగా వీళ్ల పాలన కొనసాగుతోంది.

ట్రైబల్ ఎడ్వైజరీ కమిటీ వేయాలని, ఐటీడీఏ నిధుల్లో కమిటీ చెప్పిన మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని రాజ్యాంగ హక్కుగా ఇస్తే, రెండేళ్లయినా ఆంధ్రప్రదేశ్లో ఆ కమిటీ వేయలేదు. ఎందుకంటే, కమిటీలో మూడు వంతుల సభ్యులు ఎమ్మెల్యేలు ఉండాలి. కానీ గిరిజన ఎమ్మెల్యేలు ఏడుగురు ఉంటే అందులో ఆరుగురు వైఎస్ఆర్‌సీపీ సభ్యులు కాబట్టి చంద్రబాబు అసలు కమిటీయే వేయలేదు. చంద్రబాబు తన అంతరంగాన్ని, మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. దేశవ్యాప్తంగా ప్రతి దళితుడు అడుగుతున్నాడు. కేవలం మేం క్రైస్తవ మతం తీసుకున్నాం కాబట్టి ఎస్సీ సర్టిఫికెట్ ఎందుకు ఇవ్వట్లేదని అడుగుతున్నారు. దళితుడు ఏ మతం పాటిస్తే ఏంటి, ఏ దేవుడిని పూజిస్తే ఏంటి? కేవలం క్రైస్తవమతం తీసుకున్నారన్న ఏకైక కారణంతో ఎస్సీ సర్టిఫికెట్ ఇవ్వకపోవడం దారుణం కాదా? ఇంతటి దౌర్భాగ్య పరిస్థితిలో రాష్ట్రం ఉంది.

అయినా ముఖ్యమంత్రి కనీసం నోరెత్తడం లేదు. చంద్రబాబు మైండ్ సెట్, ప్రభుత్వ మైండ్‌సెట్ కూడా మారాలి. ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు అన్నారంటే.. ఇలాంటి ముఖ్యమంత్రి తమకొద్దని ఎస్సీలు నినదిస్తున్నారు. వర్ధంతి రోజు, జయంతి రోజు తలచుకుని, 125 అడుగుల విగ్రహాన్ని పెడితే చాలదు. చంద్రబాబుకు ఒక రోగం ఉంది.  అవసరం అనుకుంటే ఫొటోలు, విగ్రహాలకు దండ వేస్తారు, అవసరం లేదనుకుంటే ఎన్టీ రామారావు జరిగినటలు వెన్నుపోటు పొడుస్తారు. మళ్లీ ఎన్నికలు వస్తే మాత్రం ఆయన ఫొటోలకు, విగ్రహాలకు దండ వేస్తారు.

అంబేద్కర్ స్ఫూర్తిని కాలరాసి, పేదలకు అన్యాయం చేస్తారు. మరోవైపు ఇలా జయంతి, వర్ధంతిరోజు విగ్రహాలకు దండ వేసి, తానే వాళ్లకోసం పోరాడుతున్నట్లు పోజిస్తారు. చంద్రబాబు అబద్ధాలు, మోసాల వల్ల ప్రజలంతా అతలాకుతలం అవుతున్నారు. చివరకు ప్రతిపక్షం అన్నదే లేకుండా చేయాలని, ప్రజల గొంతు వినిపించకూడదని వేరే పార్టీ మీద గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారు. కనీసం చేర్చుకున్నాక వాళ్లతో రాజీనామా చేయించి చేర్చుకుంటే తప్పులేదు. కానీ చంద్రబాబు ఈవాళ ప్రజల తరఫున మాట్లాడాల్సిన ఎమ్మెల్యేల గొంతు నొక్కేస్తున్నారు. వాళ్లచేత ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయించరు, కనీసం డిస్‌క్వాలిఫై చేయించరు. ప్రజల వద్దకు తీసుకెళ్లి మళ్లీ ఎన్నికలకు వెళ్లి గెలిపించుకుంటానన్న నమ్మకం ఆయనకు లేదు. ఈ చంద్రబాబుకు బుద్ధి రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను.' అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement