భర్త పుట్టినరోజు జరుపుకోలేదని... భార్య ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

భర్త పుట్టినరోజు జరుపుకోలేదని... భార్య ఆత్మహత్య

Published Sun, Aug 20 2017 6:52 AM

మృతురాలు స్నేహలక్ష్మి - Sakshi

బంజారాహిల్స్‌: తన భర్త పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినా అతను కేక్‌ కట్‌ చేయలేదని అలిగిన ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.  పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన స్నేహలక్ష్మి(30) శ్రీనివాస్‌రావు దంపతులు శ్రీకృష్ణానగర్‌ బి బ్లాక్‌లో ఉంటున్నారు. స్నేహలక్ష్మి కొండాపూర్‌లోని క్యాపిటల్‌ ఐ క్యూ కంపెనీలో ఫైనాన్షియల్‌ అనలిస్టుగా పని చేస్తోంది.
 
శుక్రవారం ఆమె తన భర్త శ్రీనివాసరావు బర్త్‌డే కావడంతో సాయంత్రం కేక్‌ తీసుకువచ్చింది. రాత్రి కేక్‌ కట్‌చేయాలని కోరగా అందుకు అతను నిరాకరిస్తూ తాను బర్త్‌డే చేసుకోనని కోపంతో బయటికి వెళ్లిపోయి రాత్రి 2.30 గంటల ప్రాంతంలో తిరిగి వచ్చాడు. దీంతో మనస్థాపానికిలోనైన స్నేహలక్ష్మి తన గదిలోకి వెళ్లి చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రీనివాసరావు తన మరదలు నాగలక్ష్మితో కలిసి ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలి సోదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.  

Advertisement
Advertisement