ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాలి | We have to help public schools | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాలి

Jun 8 2016 3:59 AM | Updated on Sep 4 2017 1:55 AM

ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాలి

ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాలి

ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే భవిష్యత్తు ఉండదనే ఆలోచన ప్రజల్లో బలంగా ఉందని, ఆ అభిప్రాయాన్ని మార్చేందుకు ఉపాధ్యాయులు ప్రయత్నించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన

తెలంగాణ, ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్
 
 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివితే భవిష్యత్తు ఉండదనే ఆలోచన ప్రజల్లో బలంగా ఉందని, ఆ అభిప్రాయాన్ని మార్చేం దుకు ఉపాధ్యాయులు ప్రయత్నించాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన వందేమాతరం ప్రతిభా పురస్కారాలు- 2016 ప్రదానోత్సవంలో ఆయన ప్రసంగించారు. గతంలో 95 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునేవారని, ఇప్పుడు పరిస్థితి పూర్తి భిన్నంగా మారిందని, ప్రభుత్వ పాఠశాలలను బతికించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

తాను రాజస్తాన్‌లోని ఏడారి ప్రాంతమైన నాగోల్ జిల్లాలో పుట్టి అక్కడే ప్రభుత్వ పాఠశాలలో చదివి ఐఏఎస్ అధికారి నయ్యానని చెప్పారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులను రిక్రూట్ చేసే పద్ధతిని తొలగించి సెలక్ట్ చేసే విధానం రావాలన్నారు. ప్రభుత్వ బడిని ప్రజల బడిగా మార్చాలని, విద్యాబోధన ఒక అభిరుచి కావాలని అభిప్రాయపడ్డారు. పాఠశాలలను తనిఖీ చేసే విధానానికి స్వస్తి చెప్పి టీచర్లను నమ్మేందుకు ప్రయత్నించాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వ పాఠశాలలకు 5 కిలోమీటర్ల పరిధి వరకు ప్రయివేట్ పాఠశాలలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. విలువలతో కూడిన నాణ్యమైన, నైతిక విద్య అందించి, పాఠశాలలను కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని చెప్పారు. చుక్కా రామయ్య గంటపాటు చేసిన సుదీర్ఘ ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ సజ్జనార్, వందేమాతరం ఫౌండేషన్ వ్యవస్థాపకుడు టి.రవీంద్ర, ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ భానుప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement