తెలుగువర్సిటీ సేవలు ఇరు రాష్ట్రాలకూ అందనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఉమ్మడి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.
సాక్షి, హైదరాబాద్: తెలుగువర్సిటీ సేవలు ఇరు రాష్ట్రాలకూ అందనున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల విద్యార్థుల కోసం ఉమ్మడి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పదో షెడ్యూల్లో ఉన్న ఈ వర్సిటీ విభజనకోసం అధికారులు, సిబ్బంది అభ్యర్థించినా ఇటువంటి సంస్థలను ఉమ్మడిగానే కొనసాగాలనే ఉద్దేశంతో ఏపీ ఈ విషయంలో మౌనం వహించింది. పైగా ఈ వర్సిటీకి తన వాటాగా ఇవ్వాల్సిన 58 శాతం నిధులనుకూడా విడుదల చేయలేదు.
ఏపీ నుంచి స్పందన లేకపోవడం తో ఈ వర్సిటీ సేవలను కేవలం తెలంగాణకే పరిమితం చేయాలంటూ తెలంగాణ ఉన్నత విద్యా కార్యదర్శి రాజీవ్రంజన్ ఇటీవల ఆచార్య వీసీ శివారెడ్డిని ఆదేశించారు. ఈ వర్సిటీకి హైదరాబాద్లో ప్రధాన కార్యాలయం ఉండగా... ఏపీలోని శ్రీశైలం (చరిత్ర, పురావస్తు తదితర శాఖలు), కూచిపూడి (నాట్యం), రాజమండ్రి (సాహిత్యం) ప్రాంగణాల్లో అడ్మిషన్ల అంశం సందిగ్ధంగా మారింది. అయి తే పదో షెడ్యూల్ సంస్థలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న నేపథ్యంలో వేరుపడడం మంచిదికాదన్న ఏపీ అధికారులు తాజాగా భావించారు.