ఆ ముగ్గురు ఐఏఎస్‌లకు ఊరట | three ias officers got relief in court | Sakshi
Sakshi News home page

ఆ ముగ్గురు ఐఏఎస్‌లకు ఊరట

Jun 10 2016 8:38 PM | Updated on Sep 4 2017 2:10 AM

ఆ ముగ్గురు ఐఏఎస్‌లకు ఊరట

ఆ ముగ్గురు ఐఏఎస్‌లకు ఊరట

కోర్టు ఉత్తర్వుల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పు అమలును ధర్మాసనం నిలుపుదల చేసింది.

హైదరాబాద్ : కోర్టు ఉత్తర్వుల అమలులో అలసత్వం ప్రదర్శించినందుకు ముగ్గురు ఐఏఎస్ అధికారులకు జరిమానా విధిస్తూ సింగిల్ జడ్జి ఇటీవల ఇచ్చిన తీర్పు అమలును ధర్మాసనం నిలుపుదల చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచంపల్లి గ్రామంలో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ చేసిన రోడ్డు ఆక్రమణలను తొలగించాలన్న ఉత్తర్వులను అమలు చేయనందుకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు తీరుపై న్యాయమూర్తి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ తీర్పును సవాలు చేస్తూ ఆయన ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు.

అదే విధంగా కార్వాన్‌లోని కూరగాయల మార్కెట్‌ను గుడిమల్కాపూర్‌కు మార్చినప్పుడు దుకాణాల కేటాయింపులో జరిగిన అన్యాయంపై కొందరు వ్యాపారులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగిల్ జడ్జి నిర్ణీత కాల వ్యవధిలోపు షాపుల కేటాయింపుపై నిర్ణయం తీసుకోవాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఆదేశాలను అమలు చేయకపోవడంతో మార్కెటింగ్‌శాఖ కమిషనర్ శరత్‌కుమార్‌కు కోర్టు ధిక్కారం కింద సింగిల్ జడ్జి రూ.5 వేల జరిమానా విధించారు.

అలాగే మరో కేసులో మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ శ్రీదేవికి రూ.1,116 జరిమానా విధించారు. ఈ తీర్పులను సవాల్ చేస్తూ శరత్‌కుమార్, శ్రీదేవి వేర్వేరుగా ధర్మాసనం ముందు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిన్నింటినీ శుక్రవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి. బొసాలే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. వాదనలు విన్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుల అమలును నిలిపి వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement