
పగలు ఎండ.. రాత్రి చలి..
నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడం.. ఉత్తర భారతం నుంచి చలిగాలులు మొదలవడంతో గత మూడు రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.
- రాష్ట్రంలో పెరుగుతున్న పగటి ఉష్ణోగ్రతలు
- మరోవైపు పడిపోతున్న రాత్రి టెంపరేచర్లు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రుతుపవనాలు వెళ్లిపోవడం.. ఉత్తర భారతం నుంచి చలిగాలులు మొదలవడంతో గత మూడు రోజులుగా రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ మేరకు అక్టోబర్లో సాధారణంగా పగలు ఎండలు, రాత్రిళ్లు చలి ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో రెండు నుంచి నాలుగు డిగ్రీల మేరకు రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గాయి. గత 24 గంటల్లో మెదక్లో రాత్రి వేళ కనిష్టంగా 16 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మహబూబ్నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 17 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి.
ఒక్క భద్రాచలంలో మాత్రమే రాత్రి వేళ సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక పగటి ఉష్ణోగ్రతలు అదే రీతిలో రెండు మూడు డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. నల్లగొండలో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 డిగ్రీలు ఎక్కువగా నమోదు కాగా... రాత్రి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి. ఖమ్మంలో పగటి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీలు ఎక్కువగా, రాత్రి వేళ 3 డిగ్రీలు తక్కువగా, మహబూబ్నగర్లో పగటి ఉష్ణోగ్రతలు 2 డిగ్రీలు అధికంగా, రాత్రి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు తక్కువగా రికార్డయ్యాయి. హైదరాబాద్లోనూ పగలు రెండు డిగ్రీలు ఎక్కువగా, రాత్రిళ్లు రెండు డిగ్రీ లు తక్కువగా నమోదయ్యాయి. ఈ నెల మొత్తం ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఈసారి చలి ఎక్కువే..
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో ఎండలు మండిపోయాయి. రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. అలాగే సెప్టెంబర్లో వందేళ్ల రికార్డును తిరగ రాసేలా నిజామాబాద్ జిల్లాలో ఒకచోట వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది ఎండలు, వర్షాలు ఎంతెక్కువో అదేస్థాయిలో చలి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. డిసెంబర్, జనవరిలలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా ఆ రెండు నెలల్లో చాలా రోజులు 14-15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెబుతున్నారు.