
'ఏవిధంగా రోజాను సస్పెండ్ చేస్తారు?'
వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏవిధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ప్రశ్నించారు.
హైదరాబాద్: వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీ నుంచి ఏవిధంగా ఏడాదిపాటు సస్పెండ్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఇంత తీవ్రమైన చర్య ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని, ఏ నిబంధనల ప్రకారం సస్పెన్షన్ వేటు వేశారని నిలదీశారు. ఆదివారం తమ్మినేని మీడియాతో మాట్లాడుతూ.. రోజా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును దూషిస్తూ వ్యాఖ్యలు చేయలేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మాత్రమే విమర్శించారని చెప్పారు. రోజాపై ఉన్న సస్పెన్షన్ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో నిబంధనలు, సంప్రదాయాలు పాటించడంలేదని తమ్మినేని విమర్శించారు. శాసనసభ చరిత్రలో ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదని అన్నారు. మంత్రి యనమల రామకృష్ణుడు తమ నిర్ణయమే ఫైనల్ అని చెబుతున్నారని, సభలో ప్రతిపక్షం అవసరం లేదా అని ప్రశ్నించారు. లోక్సభ, రాజ్యసభలో ఉన్న నిబంధనలే ఇక్కడా ఉన్నాయని చెప్పారు. గతంలో కరణం బలరాం నేరుగా స్పీకర్ను తిట్టారని, చంద్రబాబు గతంలో స్పీకర్ను రౌడీ స్పీకర్ అంటూ ముషారఫ్తో పోల్చారని చెప్పారు.