జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ అనుబంధ గుర్తింపునకు నోచుకోని కళాశాలలకు చెందిన విద్యార్థుల బదిలీ ప్రక్రియ త్వరలో
నేడు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం
సాక్షి, హైదరాబాద్: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయ అనుబంధ గుర్తింపునకు నోచుకోని కళాశాలలకు చెందిన విద్యార్థుల బదిలీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను బుధవారం ఉన్నత విద్యా మండలి విడుదల చేయనుంది. 2015-16 విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 30 కళాశాలల వరకు అనుబంధ గుర్తింపు దక్కలేదు. ఇప్పటికే ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులను ఇతర కళాశాలల్లోకి బదిలీ చేయాల్సి ఉంది.
దీనిపై మంగళవారం జేఎన్టీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదయ్య ఇతర అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నష్టం వాటిల్లకుండా ఇతర కళాశాలలకు వారిని బదిలీ చేయాలని అధికారులకు సూచిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. కోర్టు తీర్పునకు లోబడి విధి విధానాలకు అనుగుణంగా బదిలీ ప్రక్రియ చేపట్టేందుకు రంగం సిద్ధమైందని అధికారులు తెలిపారు.