కారు చౌకగా సింగరేణి విద్యుత్‌! | Singareni Electricity price as cheap | Sakshi
Sakshi News home page

కారు చౌకగా సింగరేణి విద్యుత్‌!

Jun 22 2017 1:13 AM | Updated on Sep 5 2018 1:45 PM

జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి రాష్ట్రానికి చౌకగా విద్యుత్‌ లభించనుంది.

సాక్షి, హైదరాబాద్‌: జైపూర్‌లోని సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం నుంచి రాష్ట్రానికి చౌకగా విద్యుత్‌ లభించనుంది. 1,200 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి బొగ్గు గనుల సంస్థ నిర్మించిన ఈ విద్యుత్‌ కేంద్రం యూనిట్‌ విద్యుత్‌కు రూ.3.43 చొప్పున ఖరారు చేస్తూ రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీఎస్‌ఈఆర్సీ) ఉత్తర్వులు జారీ చేసింది. రూ.5,022.76 కోట్ల అంచనా వ్యయంతో 2010లో సింగరేణి యాజమాన్యం ఈ విద్యుత్‌ కేంద్రం నిర్మాణాన్ని ప్రారంభించగా, నిర్మాణం పూర్తయ్యే సరికి వ్యయం రూ.7224.61 కోట్లకు పెరిగిపోయింది. 2016 ఆగస్టులో 600 మెగావాట్ల తొలి యూనిట్‌ నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభం కాగా, అదే ఏడాది డిసెంబర్‌లో 600 మెగావాట్ల రెండో యూనిట్‌  ఉత్పత్తి ప్రారంభమైంది.

అప్పట్లో యూనిట్‌ విద్యుత్‌ తాత్కాలిక ధర రూ.3.26గా ఈఆర్సీ ఖరారు చేయగా, తాజాగా  యూనిట్‌కు రూ.3.43గా ఖరారు చేసింది. వాస్తవానికి ఈ విద్యుత్‌ ధరను యూనిట్‌కు రూ.4.34గా నిర్ణయించాలని సింగరేణి యాజమాన్యం విజ్ఞప్తి చేసింది. యూనిట్‌కు స్థిర వ్యయం రూ.2.43, చర వ్యయం కలిపి  యూనిట్‌కు రూ.1.91గా ఖరారు చేయాలని సింగరేణి  చేసిన ప్రతిపాదనలను ఈఆర్సీ తిరస్కరించింది. స్థిర వ్యయం రూ.1.74, చర వ్యయం రూ.1.69 కలిపి యూనిట్‌కు రూ.3.43 మాత్రమే చెల్లించాలని ఈఆర్సీ ఆదేశిం చింది. ఏడాదికి 7,779 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి ఉంటుందని సింగరేణి  ప్రతిపాదించగా, 8,421 మిలియన్‌ యూనిట్ల ఉంటుందని ఈఆర్సీ నిర్ణయిం చడంతో  స్థిర వ్యయం భారీగా తగ్గింది.

Advertisement
 
Advertisement
Advertisement