ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు | Shopping Complexes in the MMTS stations | Sakshi
Sakshi News home page

ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు

Feb 20 2017 2:16 AM | Updated on Sep 2 2018 4:03 PM

ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు - Sakshi

ఎంఎంటీఎస్‌ స్టేషన్లలో షాపింగ్‌ కాంప్లెక్స్‌లు

రాజధానిలోని ఎంఎంటీఎస్‌ స్టేషన్లు కొత్త సోకులు అద్దు కోనున్నాయి.

మల్టీప్లెక్స్‌లు,ఎంటర్‌టైన్‌మెంట్‌ సెంటర్లు
వాణిజ్య సముదాయాలపై దృష్టి
రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రతిపాదనలు


సాక్షి, హైదరాబాద్‌: రాజధానిలోని ఎంఎంటీఎస్‌ స్టేషన్లు కొత్త సోకులు అద్దు కోనున్నాయి. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ప్రతిపాదించిన తరహాలో వాణిజ్య భవన సముదాయాలు అంతరించనున్నాయి. వీటి తోపాటు మల్టీప్లెక్స్‌ థియేటర్లు, ఎంటర్‌ టైన్‌మెంట్, షాపింగ్‌ కేంద్రాలు అందు బాటులోకి రానున్నాయి. రైల్వే సొంత స్థలా లను వాణిజ్య కార్యకలాపాల కోసం లీజుకు ఇవ్వడం ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యంతో అధికారులు ప్రతిపాద నలు సిద్ధం చేశారు. జంటనగరాల్లోని రైల్వే స్థలాలపై గతంలోనే సమగ్ర సర్వే చేసిన రైల్వే ల్యాండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఈ దిశగా ప్రణాళికలను రూపొందించింది. నగరంలోని ప్రధానమైన ఎంఎంటీఎస్‌ రైల్వే స్టేషన్లను ఆనుకొని ఉన్న స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.250 కోట్లకు పైగా ఆదాయం లభిస్తుందని అంచనా వేసింది.

అదనపు ఆదాయమే లక్ష్యం...
నిత్యం పర్యాటకులు, సందర్శకులతో రద్దీగా ఉండే నెక్లెస్‌రోడ్డు, సంజీవయ్య పార్కు, బేగంపేట్, ఖైరతాబాద్, లకడీకపూల్‌ ఎంఎంటీఎస్‌ స్టేషన్లలోని రైల్వే స్థలాలను వాణిజ్య సముదాయాలుగా అభివృద్ధి చేయవచ్చునని రైల్వే ల్యాండ్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ సూచించింది. ఈ సంస్థ అందజేసిన వివరాల ప్రకారం సంజీవయ్య పార్కు స్టేషన్‌కు ఆనుకొని సుమారు ఎకరం ఉంది. దీన్ని లీజుకిస్తే ఏటా రూ.45 కోట్ల ఆదాయం లభిస్తుందని భావిస్తోంది. నెక్లెస్‌రోడ్డు స్టేషన్‌ వద్దనున్న ఎకరం పైన మరో రూ.60 కోట్ల వరకు ఆర్జించవచ్చని ఆశిస్తోంది. అలాగే బేగంపేట్‌ రైల్వేస్టేషన్‌ వద్ద రెండు వేల గజాలుంది. ఖైరతాబాద్, లకడీకపూల్‌ స్టేషన్లలో ఒకటిన్నర ఎకరం ఉన్నట్లు అంచనా. ఒక్కో స్టేషన్‌లో లీజుకు ఇవ్వడం ద్వారా ఏటా రూ.40 నుంచి రూ.50 కోట్ల చొప్పున ఆదాయం లభిస్తుంది. ఈ ఐదు స్టేషన్‌న్లలోని స్థలాల లీజు ద్వారా సుమారు రూ.250 కోట్ల నుంచి రూ.300 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని తేల్చింది.

రెండో దశలో మరిన్ని...
రెండో దశలో సనత్‌నగర్, హైటెక్‌సిటీ, లింగంపల్లి, బోరబండ, నేచర్‌క్యూర్‌ తదితర రైల్వే స్టేషన్ల స్థలాలను కూడా వాణిజ్య పరంగా అభివృద్ధి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఇతర స్థలాల్లోనూ...
ఇవే కాకుండా... నగరంలోని వివిధ ప్రాంతాల్లో రైల్వేకు ఉన్న స్థలాలను కూడా వాణిజ్యపరంగా వినియోగంలోకి తేవాలని దక్షిణమధ్య రైల్వే భావిస్తోంది. సంగీత్‌ చౌరస్తాలో 2 ఎకరాలు, సికింద్రాబాద్‌ బ్లూ సీ హోటల్‌ ఎదురుగా ఉన్న 2 వేల గజాలు, కాచిగూడ రైల్వేస్టేషన్‌ పార్శిల్‌ విభాగం పక్కనున్న మరో 1,000 గజాల స్థలాన్ని ఇదే తరహాలో మల్టీప్లెక్స్‌లు, బడ్జెట్‌ హోటళ్ల వంటి వాణిజ్య కార్యకలాపాలకు వినియోగించడం ద్వారా ఏటా రూ.500 కోట్ల వరకు ఆదాయం వస్తుందన్నది అధికారుల అంచనా.  పరిశీలన దశలోనే ఉన్న ఇవి కార్యరూపం దాల్చేందుకు సమయం పట్టవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement