దారి దోపిడీ ముఠా అరెస్ట్ | robbery gang arrested in hyderabad | Sakshi
Sakshi News home page

దారి దోపిడీ ముఠా అరెస్ట్

Apr 23 2015 12:00 AM | Updated on Aug 30 2018 5:27 PM

దారి దోపిడీకి పాల్పడిన ఓ ముఠాను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి కారు, బైక్‌తోపాటు రూ. 6.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు.

హైదరాబాద్ : దారి దోపిడీకి పాల్పడిన ఓ ముఠాను మీర్‌పేట పోలీసులు అరెస్టు చేసి కారు, బైక్‌తోపాటు రూ. 6.5 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్, మీర్‌పేట ఇన్‌స్పెక్టర్ భిక్షంరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... ఈనెల 13న తెలుగు రాములు అనే వ్యక్తి బాలాపూర్ చౌరస్తా మీదుగా కారు నడుపుకుంటూ వెళ్తున్నాడు.

సాయినగర్ కాలనీలో లెనిన్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ కేతావత్ రఘు (25), మన్సురాబాద్‌కు చెందిన కేంసారం హరీశ్ (22), ప్రశాంతినగర్‌కు చెందిన పెయింటర్ ఎర్లపల్లి జగదీప్ (19) లిఫ్ట్ ఇవ్వాలని కారు ఎక్కారు. కొద్ది దూరం వెళ్లాక డ్రైవర్ రాములును కత్తులతో బెదిరించి దాడి చేశారు. అనంతరం రాములు వద్దనున్న రూ.6 లక్షల 50 వేలు లాక్కొని, అతని కారుతోపాటు ఉడాయించారు. బాధితుడి మీర్పేట పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి.. స్పెషల్ టీమ్‌కు ఈ కేసును అప్పగించటంతో గాలింపు తీవ్రం చేశారు.

ఈ నెల 21న విరాట్‌నగర్ చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టిన పోలీసులకు దుండగులు ఎత్తుకెళ్లిన రాములు కారు (టీఎస్ 08 వైడీ టీఆర్ నెం.4833) కనిపించింది. పోలీసులు ఆ కారును ఆపి అందులో ప్రయాణిస్తున్న ముగ్గురినీ అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు విషయం బయటపెట్టారు. నిందితుల నుంచి కారుతో పాటు బైక్, నగదు స్వాధీనం చేసుకుని ముగ్గురినీ రిమాండ్‌కు తరలించారు. ఇదిలావుండగా కేతావత్ రఘు గతంలో తాండూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గుప్త నిధుల తవ్వకాల కేసులో జైలు శిక్ష అనుభవించినట్లు ఏసీపీ తెలిపారు. మరో నిందితుడు కేంసారం హరీశ్ సీతాఫల్‌మండి, ఎల్బీనగర్, ఉప్పల్ తదితర పోలీస్ స్టేషన్ పరిధుల్లో చోరీలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడని పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement