
సాక్షి, హైదరాబాద్: హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిపై మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య స్పందించారు. ఈ ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధైర్యపడరని తెలిపారు. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయనప్పటికీ సీట్లు, ఓట్లు పెరిగాయని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని స్పష్టంగా అర్థమైందని వివరించారు. అయితే టీపీసీసీ చీఫ్ పదవిపై మాట్లడటానికి పొన్నాల నిరాకరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...‘హుజూరు నగర్ ఉప ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రన కాంగ్రెస్ శ్రేణులు అధైర్యపడరు. ఉపఎన్నికల్లో అధికారపార్టీకి వెసులబాటు ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ గెలిచింది. ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీ గెలవడం సర్వసాధారణమే. కాంగ్రెస్ పార్టీ నెమ్మదిగా పుంజుకుంటోంది. మహారాష్ట్ర ,హరియాణాలో ప్రధాని నరేంద్ర మోదీ విస్తృతంగా ప్రచారం చేసినా గతంతో పోలిస్తే బీజేపీ సీట్ల సంఖ్య తగ్గింది. కాంగ్రెస్ పార్టీకి గతంతో పోలిస్తే సీట్లు, ఓట్లు పెరిగాయి. ఆర్టికల్ 370 రద్దును ఎన్నికల అస్త్రంగా వాడుకొని ప్రచారం చేసిన బీజేపీ కూటమికి గతంలో కన్నా ఎక్కువ సీట్లు రాలేదు. సెంటిమెంట్, బెదిరింపులు శాశ్వతంగా పనిచేయవు. ప్రజలు మార్పు కోరుకుంటారు’ అని పొన్నాల లక్ష్మయ్య తెలిపారు.