రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సు కన్వీనర్ కోటాలో సీట్లు మిగలడమే కాకుండా మేనేజ్మెంట్ కోటాలోనూ భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి.
* 33 వేల సీట్లకు 19 వేలు మాత్రమే భర్తీ
* లెక్కలు తేల్చిన ఉన్నత విద్యా మండలి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సు కన్వీనర్ కోటాలో సీట్లు మిగలడమే కాకుండా మేనేజ్మెంట్ కోటాలోనూ భారీగా సీట్లు మిగిలిపోతున్నాయి. 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి మేనేజ్మెంట్ కోటాలో భర్తీ అయిన సీట్ల సంఖ్యను ఉన్నత విద్యా మండలి తేల్చింది. 30 శాతం మేనేజ్మెంట్ కోటాలో 19,171 సీట్లు మాత్రమే భర్తీ అయినట్లు లెక్కలు వేసింది. ఇక 2015-16 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో మొత్తంగా ఇంజనీరింగ్ సీట్లు 59 శాతమే భర్తీ అయ్యాయి.
అందులో మేనేజ్మెంట్ కోటాలో 57 శాతం సీట్లు భర్తీ కాగా, 43 శాతం సీట్లు మిగిలిపోయాయి. రాష్ట్రంలోని 340 ఇంజనీరింగ్ కాలేజీల్లో 1,10,255 సీట్ల భర్తీకి అనుమతి ఇవ్వగా మేనేజ్మెంట్ కోటా కింద 33,377 సీట్లు కేటాయించారు. అందులో 19,171 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. యాజమాన్యాలు రాటిఫికేషన్ కోసం దరఖాస్తు చేసిన లెక్కల ప్రకారం 15,794 సీట్లు మిగిలిపోయాయి.