ఉద్యోగ భద్రతకు త్వరలో చట్టం: దత్తాత్రేయ | job security law coming Soon | Sakshi
Sakshi News home page

ఉద్యోగ భద్రతకు త్వరలో చట్టం: దత్తాత్రేయ

Sep 18 2016 6:44 PM | Updated on Sep 4 2018 5:24 PM

ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు.

- యజమాని మారిన ఉద్యోగ భద్రత లభించేలా చట్టం తీసుకొస్తాం
- విశ్వకర్మ జయంతి సందర్భంగా వివిధ రంగ కార్మికులకు సన్మానం
సాక్షి, హైదరాబాద్

 ప్రభుత్వరంగంలో మాదిరిగానే ప్రై వేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించేలా త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ తెలిపారు. కంపెనీ యాజమాన్యం మారినా ఉద్యోగులను తొలగించకుండా కొనసాగించేలా నూతన చట్టం రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఒకవేళ అకస్మాత్తుగా కంపెనీ మూసేయాల్సి వస్తే కార్మికుడు పొందుతున్న వేతనాన్ని మూడురెట్లు చెల్లించాల్సి ఉంటుందన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా పలు రంగాల్లోని కార్మికులను ఆదివారం ఆర్టీసీ కళాభవన్‌లో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ... ఇక నుంచి ప్రతీ ఏటా విశ్వకర్మ జయంతిని జాతీయ కార్మిక దినోత్సవంగా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొన్నారు. భారతదేశ మొట్ట మొదటి ఇంజనీరు విశ్వకర్మ జయంతిని.. జాతీయ కార్మికదినోత్సవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

 

విశ్వకర్మ తయారు చేసిన పనిముట్ల వల్లే దేశంలో లక్షలాది మంది కార్మికులకు ఉపాధి కలుగుతోందన్నారు. అందుకే విశ్వకర్మ చేసిన సేవలను ప్రపంచానికి తెలియజేయాలని తమ ప్రభుత్వం ఆయన జన్మదినాన్ని జాతీయ కార్మికదినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే తాము ముఖ్యంగా కార్మికులకు సంబంధించి మూడు అంశాల మీద దృష్టిసారించినట్లు దత్తాత్రేయ వివరించారు. ఉద్యోగ, సామాజి, ఆర్థిక భద్రత కలిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అందులో భాగంగానే నైపుణ్యరహిత కార్మికుల దినసరి వేతనాన్ని రూ.160 నుంచి 350కి పెంచామన్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులకు నెలకు రూ.22వేలు చెల్లించేలా చట్టం తీసుకొచ్చామన్నారు. ముద్రబ్యాంకు ద్వారా కార్మికులకు రుణాలు కల్పించి... యజమానిగా మారేందుకు దోహదం చేస్తున్నట్లు వివరించారు. ముద్ర బ్యాంకు ద్వారా ఇప్పటి వరకు రూ.1.80లక్షల కోట్ల రుణాలు అందజేసినట్లు పేర్కొన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులకు ఈఎస్‌ఐ, పీఎఫ్ సదుపాయాన్ని కల్పిస్తామన్నారు.

 

2022 నాటికి దేశంలోని కార్మికులందరికీ గృహవసతి కల్పిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పదివేల బీడీ కార్మికులకు ఇళ్లు కట్టించడానికి కార్మికశాఖ సిద్ధంగా ఉందన్నారు. అలాగే కార్మికుల హక్కుల కోసం ప్రస్తుతం ఉన్న 44 చట్టాలను నాలుగు కోడ్స్‌గా విభజించనున్నట్లు తెలిపారు. దీని వల్ల కార్మికుల హక్కులకు ఎలాంటి నష్టం వాటిల్లదని దత్తాత్రేయ చెప్పారు. వేతనబోర్డు, ఇండస్ట్రియల్ రిలేషన్స్(ఐ.ఆర్), సామాజిక భద్రత, హెల్త్ అండ్ వర్కింగ్ అంశాల విభాగాల ఆధారంగా కార్మిక చట్టాలను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, కార్మికశాఖ అధికారులు, నేతలు పాల్గొన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement