'భర్తలూ.. జోక్యం చేసుకోకండి' | " Husbands do not interfere ' Circular issued by the GHMC Commissioner | Sakshi
Sakshi News home page

'భర్తలూ.. జోక్యం చేసుకోకండి'

Apr 12 2016 6:14 PM | Updated on Sep 3 2017 9:47 PM

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న మహిళా కార్పొరేటర్ల భర్తలు ఇక నుంచి అధికారుల విధి నిర్వహణలో జోక్యం చేసుకోరాదంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జారీచేశారు.

ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్‌లో కొనసాగుతున్న మహిళా కార్పొరేటర్ల భర్తలు ఇక నుంచి అధికారుల విధి నిర్వహణలో జోక్యం చేసుకోరాదంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ జారీ చేసిన సర్క్యూలర్‌తో పాతబస్తీలోని మహిళా కార్పొరేటర్ల బంధుగణం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ నెల 6వ (నంబర్-236/ ఎంఎస్/జీహెచ్‌ఎంసీ/ 2016/ 64) తేదీన గ్రేటర్ కమిషనర్ సర్క్యులర్ జారీ చేశారు.

 

దీనిని అన్ని జోనల్ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లకు పంపించారు. ఎట్టి పరిస్థితుల్లో మహిళా కార్పొరేటర్లు మాత్రమే అధికారులతో సంప్రదిస్తూ ప్రజా సమస్యల పరిష్కారంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని వారి తరపున ఎట్టి పరిస్థితుల్లో వారి భర్తలు జోక్యం చేసుకోరాదంటూ ఈ సర్క్యులర్ జారీ చేశారు. జీహెచ్‌ఎంసీ దక్షిణ మండలం పరిధిలో ఘాన్సీబజార్, గౌలిపురా, సైదాబాద్, ఐ.ఎస్. సదన్, కుర్మగూడ, ఫలక్‌నుమా, నవాబ్‌సాబ్‌కుంట, ముసారంబాగ్, ఓల్డ్ మలక్‌పేట్, ఆజంపురా, మొఘల్‌పురా, తలాబ్‌చంచలం, కంచన్‌బాగ్, బార్కాస్, సులేమాన్‌నగర్, రాజేంద్రనగర్, అత్తాపూర్ తదితర మున్సిపల్ డివిజన్ల నుంచి మహిళా కార్పొరేటర్లు ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

 

ఇలా సర్క్యులర్ జారీ చేయడం సరి కాదని.. మహిళా కార్పొరేటర్లు హాజరు కాలేని కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లోనే తాము సంబంధిత అధికారులతో సంప్రదించి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రయత్నిస్తాం తప్ప... వారి విధి నిర్వహణలో ఎలాంటి జోక్యం కలిగించుకోమంటూ పాతబస్తీకి చెందిన పలువురు మహిళా కార్పొరేటర్ల భర్తలు అంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement