వినియోగదారులకు లబ్ధి చేకూరాలి : ఎంపీ మేకపాటి | Govt in advanced stages of talks on special status to Andhra Pradesh | Sakshi
Sakshi News home page

వినియోగదారులకు లబ్ధి చేకూరాలి : ఎంపీ మేకపాటి

Aug 9 2016 2:29 AM | Updated on May 25 2018 9:20 PM

వినియోగదారులకు లబ్ధి చేకూరాలి : ఎంపీ మేకపాటి - Sakshi

వినియోగదారులకు లబ్ధి చేకూరాలి : ఎంపీ మేకపాటి

జీఎస్టీ వల్ల అంతిమంగా వినియోగదారులకు లబ్ధి చేకూరాలని ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చెప్పారు.

జీఎస్టీ బిల్లుపై చర్చలో వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి
సాక్షి, న్యూఢిల్లీ: జీఎస్టీ వల్ల అంతిమంగా వినియోగదారులకు లబ్ధి చేకూరాలని ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి చెప్పారు. సోమవారం లోక్‌సభలో ఈ అంశంపై ఆయన మాట్లాడారు. ‘సిద్ధాంతపరంగా ఈ బిల్లు పన్నుల మీద పన్నులను తొలగించి వినియోగదారులకు మేలు చేకూర్చేలా కనిపిస్తోంది. అయితే ఇది జీఎస్టీ రేటుపై ఆధారపడి ఉంది. కేంద్రం తన ఎక్సైజ్, సర్వీసు పన్నుల వసూళ్ల నుంచి ఒక్క రూపాయి కూడా కోల్పోకుండా ఉండాలని భావిస్తూ, రాష్ట్రాలు కూడా తమ ఆదాయాన్ని కోల్పోరాదని భావిస్తే జీఎస్టీ అమలుకు ముందు పరిస్థితి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంటుంది. అప్పుడు జీఎస్టీ వల్ల వినియోగదారుడు ఏరకంగా ప్రయోజనం పొందుతాడు? అమలైతే తమపై పన్ను భారం తగ్గుతుందని సామాన్యుడు ఆశిస్తున్నాడు.

దీనిని మనం గుర్తుపెట్టుకోవాలి..’ అని మేకపాటి అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశాన్ని మేకపాటి ఈ సందర్భంగా మరోసారి ప్రస్తావించారు. ‘అప్పటి ప్రధానమంత్రి హామీ అమలు కోసం ఐదు కోట్ల మంది ఆంధ్రులు నిరీక్షిస్తున్నారు. కేంద్రం  హోదాను ఇవ్వాలి..’ అని కోరారు.
 
జీఎస్టీకి మద్దతిస్తున్నాం: రవీంద్రబాబు
జీఎస్టీ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నామని, ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని టీడీపీ ఎంపీ పి.రవీంద్రబాబు కోరారు. జీఎస్‌టీ బిల్లుపై చర్చలో పాల్గొంటూ.. ‘తాము జీఎస్‌టీ బిల్లుకు మద్దతు ఇస్తున్నందున, తాము అడుగుతున్నది కూడా ఇవ్వాలని, తాము ఎప్పటికీ క్రమశిక్షణ కలిగిన సైనికుల వంటి వాళ్లమే..’నని రవీంద్రబాబు పేర్కొన్నారు. జీఎస్‌టీ వల్ల రాష్ట్రం కోల్పోయే నష్టాన్ని కేంద్రం పూర్తిగా భర్తీ చేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement