భూ నిర్వాసితులకు నజరానా | Government huge compensation to Land expats | Sakshi
Sakshi News home page

భూ నిర్వాసితులకు నజరానా

Jan 4 2017 2:32 AM | Updated on Aug 30 2019 8:17 PM

మిడ్‌ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల వల్ల నిర్వాసితు లైన యువతకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది.

సాక్షి, హైదరాబాద్‌: మిడ్‌ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల వల్ల నిర్వాసితు లైన యువతకు ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఈ ప్రాజెక్టు ల పరిధిలో ఆర్‌అండ్‌ఆర్‌ నోటిఫి కేషన్‌ ఇచ్చిన 2010 ఆగస్టు నాటికి మైనర్లుగా ఉండి 2015 జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రత్యేక ఆర్థిక సాయం కింద ఏకమొత్తంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం నీటిపారుదల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ ఎస్‌కే జోషీ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ ఉత్తర్వుల ప్రకారం రెండు ప్రాజెక్టుల పరిధి లోని 9,484 మంది నిర్వాసిత యువతకు రూ. 189.68 కోట్ల ప్రత్యేక ఆర్థిక సాయం అందనుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ప్రత్యేక సాయం పొందే వారిలో కరీంనగర్‌ పరిధిలోని 3,127 మందికి రూ. 62.54 కోట్లు, ఆదిలాబాద్‌ పరిధిలోని 1,974 మందికి రూ. 39.48 కోట్లు కలిపి మొత్తంగా రూ. 102.02 కోట్ల ఆర్థిక సాయం పొందను న్నారు. అలాగే మిడ్‌మానేరు పరిధిలోని గౌరవెల్లి రిజర్వాయర్‌ పరిధిలో 152 మందికి రూ. 3.04 కోట్లు, ఇదే ప్రాజెక్టు పరిధిలోని ఇందిరమ్మ వరద కాల్వ కింద ఉన్న 4,231 మందికి రూ. 84.62 కోట్లు కలిపి రూ. 87.66 కోట్ల ఆర్థిక సాయం అందుకోనున్నారు.

గతేడాది నిర్ణయం..ప్రస్తుతం అమలు..: మిడ్‌ మానేరు, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిధిలో సామాజిక ఆర్ధిక సర్వే (ఎస్‌ఈఎస్‌) ఆధారంగా గుర్తించిన యువతకు మానవతా దృక్పథంతో ఆర్థిక సాయం అందిం చాలని గతేడాది జనవరిలోనే నిర్ణయం జరిగింది. 2010 ఆగస్టు 26 నాటికి సామాజిక ఆర్థిక సర్వే సమయానికి మైనర్లుగా ఉండి 2015 జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద ఓసీ, బీసీలకు రూ. 2 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు రూ. 2.30 లక్షలు చెల్లిస్తే సబబుగా ఉంటుందని సర్కారు భావించింది. అయితే ఈ విధానం ద్వారా చెల్లింపులకు మార్గదర్శకాలు లేకపోవడంతో ఈ ప్రక్రియ ముందుకు పోలేదు. అనంతరం తిరిగి కొత్తగా మార్గదర్శకాలు రూపొందించి నిర్ణీత గడువులో 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారి జాబితా సిద్ధమైంది.

అయితే ఇతర ప్రాజెక్టుల పరిధిలోనూ ప్రత్యేక ఆర్థిక సాయం డిమాండ్‌లు వచ్చే అవకాశాలున్న దృష్ట్యా ఈ ప్రతిపాదనను జూన్‌లో జరిగిన కేబినెట్‌ సమావేశంలో తిరస్కరించారు. కానీ గతేడాది సెప్టెంబర్‌లో కురిసన భారీ వర్షాల వల్ల మిడ్‌ మానేరు కట్టలు తెగిపోయిన సందర్భంగా కరీంనగర్‌ వెళ్లిన సీఎం కేసీఆర్‌ స్థానిక ప్రజాప్రతినిధుల వినతులను దృష్టిలో పెట్టుకొని నిర్వాసిత యువతకు రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు.

Advertisement
 
Advertisement
Advertisement