'కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి' | GHMC fetches whopping income with banned notes | Sakshi
Sakshi News home page

'కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి'

Nov 15 2016 12:43 PM | Updated on Sep 4 2017 8:10 PM

'కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి'

'కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి'

పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సర్కారు ఖజానా గలగలలాడుతోంది.

హైదరాబాద్‌: పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో సర్కారు ఖజానా గలగల లాడుతోంది. రద్దయిన రూ.500, రూ.1,000 నోట్లతో ప్రభుత్వ విభాగాల బిల్లులు, బకాయిలు చెల్లించ వచ్చన్న వెసులు బాటుతో కోట్లకు కోట్లు వచ్చిపడుతున్నాయి. జీహెచ్‌ఎంసీ తదితర విభాగాలకు మొత్తం నాలుగు రోజుల్లో సుమారు రూ.389 కోట్ల వరకు ఆదాయం సమకూరింది.
 
ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తున్న నేపథ్యంలో రద్దయిన నోట్లతో వివిధ పన్నులు, చార్జీలు, జరిమానాలు చెల్లింపు గడువును ప్రభుత్వం ఈ నెల 24 వరకు పొడిగించింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)కి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరు తుండగా, డిస్కం, జలమండలిలకు భారీగా బకాయిలు వసూలవుతున్నాయి. ట్రాఫిక్‌ ఈ-చెలానా చెల్లింపులు  కూడా పెద్దఎత్తున చెల్లింపులు జరుగుతున్నాయి. 
 
జీహెచ్‌ఎంసీకి రూ.157 కోట్లు 
జీహెచ్‌ఎంసీకి గత నాలుగు రోజుల్లో ఆస్తి పన్ను, ఎల్‌ఆర్‌ఎస్‌ ఫీజుల రూపంలో రికార్డు స్థాయిలో దాదాపు రూ.157 కోట్లు వసూలయ్యాయి. సోమవారం ఒక్కరోజే రూ.55 కోట్లు రాగా, అందులో ఆస్తి పన్ను కింద రూ.19 కోట్లు, లేఅవుట్ల క్రమ బద్ధీకరణ కింద రూ.36 కోట్ల వరకు పన్ను వసూలైంది. కొందరు ముందస్తు ఆస్తి పన్ను, ఎల్‌ఆర్‌ఎస్‌ కూడా చెల్లిస్తుండటం విశేషం. 
 
భారీగా వసూలైన విద్యుత్‌ చార్జీలు 
విద్యుత్‌ శాఖకు కూడా భారీగా ఆదాయం సమకూరుతోంది. గత నాలుగు రోజుల్లో సుమారు రూ.202 కోట్లు వసూలయ్యాయి. సెలవు దినమైనప్పటికీ విద్యుత్‌ శాఖ కౌంటర్లు పనిచేయడంతో సుమారు రూ.20 కోట్ల వరకు చార్జీలు వసూలయ్యాయి. కొందరు వినియోగదారులు ముందస్తు చార్జీలు కూడా చెల్లిస్తున్నారు. 
 
పెరిగిన బకాయిల చెల్లింపులు 
పెద్ద నోట్ల రద్దుతో జలమండలికి మొండి బకాయిలు పెద్ద ఎత్తున వసూలవు తున్నాయి. ఈ నాలుగు రోజుల్లో సుమారు రూ.30 కోట్ల వరకు ఆదాయం సమకూరింది. సోమవారం రూ.4.44 కోట్లు చార్జీల రూపేణా చెల్లింపులు జరిగాయి. 
 
ట్రాఫిక్‌ ఈ-చెలానా చెల్లింపులు  
ఇక ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్‌ ఈ–చలాన్లను కూడా వాహన దారులు రద్దయిన నోట్లతో క్లియర్‌ చేసుకొంటున్నారు. మీ–సేవ, ఈ–సేవా కేంద్రాల ద్వారా పెద్దఎత్తున చెల్లింపులు జరిపారు. సోమవారం సుమారు రూ.13 లక్షలకు పైగా పోలీసు యంత్రాంగానికి ఆదాయం సమకూరింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement