రాళ్లతో కొట్టారు: తెలుగు విద్యార్థులు | Beaten with stones: Telugu students | Sakshi
Sakshi News home page

రాళ్లతో కొట్టారు: తెలుగు విద్యార్థులు

Apr 7 2016 1:27 AM | Updated on Sep 3 2017 9:20 PM

శ్రీనగర్ ఎన్‌ఐటీలో చదువుతున్న తెలుగు విద్యార్థి హిమవంత్ తన ఆవేదనను ఫోన్ ద్వారా మీడియాకు తెలియజేశాడు.

సాక్షి, హైదరాబాద్: శ్రీనగర్ ఎన్‌ఐటీలో చదువుతున్న తెలుగు విద్యార్థి హిమవంత్ తన ఆవేదనను ఫోన్ ద్వారా మీడియాకు తెలియజేశాడు. ‘భారత్-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు స్థానికులు మాపై రాళ్లు విసిరారు. డెరైక్టర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. విషయం బయటకు చెబితే ఫెయిల్ చేస్తామని, రెండేళ్లు ఎక్స్‌టెండ్ చేస్తామని  బెదిరించారు. మేం శాంతియుతంగా నిరసన తెలియజేస్తుండగా.. మీడియాతో మాట్లాడాలి రండి అంటూ పోలీసులు మెయిన్ గేట్ వరకు తీసుకెళ్లి  లాఠీచార్జి చేశారు. ఒక్కో విద్యార్థిపై ఐదుగురు దాడి చేశారు. దాదాపు 50 మంది విద్యార్థుల తలలు పగిలాయి.

ఇక్కడ తెలుగు విద్యార్థులు 120 మందికిపైగా ఉన్నారు. వీరిలో చాలామందికి దెబ్బలు తగిలాయి. ఒక విద్యార్థి తల పగిలింది. పోలీసులు విద్యార్థులను ఒక గదిలో బంధించి కొడుతున్నారు.  మా తల్లిదండ్రులతో మాట్లాడేందుకు అనుమతించడం లేదు. విద్యార్థినులపై అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారు. గాయపడ్డవారికి సరైన చికిత్స అందించడం లేదు. మీడియా సాయం కూడా అందకుండా చేస్తున్నారు. ఎవరినీ లోపలికి రానీయడం లేదు, మమ్మల్ని బయటకు వెళ్లనీయడం లేదు. ఐదుగురు విద్యార్థులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. చాలామంది కాళ్లకు దెబ్బలు తగిలి నడవలేని స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం మాకు ఇక్కడ ఎలాంటి రక్షణా లేదు. మమ్మల్ని వెంటనే శ్రీనగర్ ఎన్‌ఐటీ  నుంచి బయటకు తీసుకెళ్లాలి. మరో ఎన్‌ఐటీకి మార్చాలి’ అని హిమవంత్ విజ్ఞప్తి చేశాడు.

Advertisement
 
Advertisement
Advertisement