‘మురుగు స్కామ్‌’లో 12 మంది కాంట్రాక్టర్ల అరెస్టు | 12 contractor arrested | Sakshi
Sakshi News home page

‘మురుగు స్కామ్‌’లో 12 మంది కాంట్రాక్టర్ల అరెస్టు

Jul 4 2017 2:09 AM | Updated on Sep 5 2017 3:06 PM

నాలాల పూడికతీత ముసుగులో జీహెచ్‌ఎంసీలో చోటు చేసుకున్న భారీ స్కామ్‌ కేసుల్లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది.

- వీరిలో ఆరుగురు గతంలో  వేరే కేసులో కటకటాల్లోకి
అభియోగపత్రాలు దాఖలుకు సన్నాహాలు చేస్తున్న సీసీఎస్‌ 
 
సాక్షి, హైదరాబాద్‌: నాలాల పూడికతీత ముసుగులో జీహెచ్‌ఎంసీలో చోటు చేసుకున్న భారీ స్కామ్‌ కేసుల్లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఈ కేసుకు సంబంధించి సోమవారం మరో 12 మంది కాంట్రాక్టర్లను అరెస్టు చేశారు. ఈ కేసుల దర్యాప్తు చేపట్టిన నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) అధికారులు మే, జూన్‌ నెలల్లో 18 మంది కాంట్రాక్టర్లు, 19 మంది ఏఈలను అరెస్టు చేశారు.  తాజాగా అరెస్టయిన వారిలో ఆరుగురు గతంలో వేరే కేసులో అరెస్టు అయి జైలుకు వెళ్లివచ్చినవారు కాగా... మరో ఆరుగురు తొలిసారిగా కటాకటాల్లోకి చేరారు. దీంతో అరెస్టు అయిన కాంట్రాక్టర్ల సంఖ్య 24కు చేరింది.

తాజాగా అరెస్టయిన కాంట్రాక్టర్లలో వరికుప్పల శ్రీనివాస్, సామ శ్రీనివాస్‌రెడ్డి, తాడూర్‌ రామ్‌చంద్రారెడ్డి, తూముకుంట వసంత్‌రెడ్డి, నాగిళ్ళ రాజశేఖర్‌రెడ్డి, వరికుప్పల కృష్ణ, ఇ.వేణుగోపాల్, గండికోట జనార్థన్, ఎక్కల విజయ్‌కుమార్, అనకర్ల యశ్వంత్, గండికోట రమేష్, గండికోట లక్ష్మణ్‌లు ఉన్నారు. వీరంతా స్థానికంగా వివిధ పార్టీలకు చెందిన వారని తెలుస్తోంది. మరోపక్క ఈ స్కామ్‌ కేసుల్లో నిందితులపై చార్జిషీట్లు దాఖలు చేయడానికి సీసీఎస్‌ పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా అరెస్టు అయిన ఏఈలకు సంబంధించి ప్రాసిక్యూషన్‌ అనుమతి కోరాలని నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement