కృష్ణా నదిలో ఈత కొట్టడానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తూ చనిపోయారు.
ఈతకెళ్లి ఇద్దరు విద్యార్థుల మృతి
Apr 2 2017 4:50 PM | Updated on May 25 2018 7:04 PM
గుంటూరు: అమరావతిలోని అమరేశ్వర స్నానఘాట్ వద్ద కృష్ణా నదిలో ఈత కొట్టడానికి దిగిన ఇద్దరు విద్యార్థులు ప్రమాదవశాత్తూ మునిగి చనిపోయారు. మృతులిద్దరూ విజయవాడలోని శ్రీమేథ కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. ఆదివారం సెలవు కావడంతో మర్రిచెట్టు నారాయణ(20), ఎర్రగోళ్ల మనోహర్(19)లు అమరావతిలో ఉన్న స్నేహితుల వద్దకు వచ్చారు. సరదాగా మరో నలుగురు స్నేహితులతో కలిసి ఈత కొడదామని కృష్ణా నది వద్దకు వచ్చారు. ఈ ఇద్దరూ లోపలికి దిగి ప్రమాదవశాత్తూ మునిగిపోయారు. నారాయణది కృష్ణా జిల్లా మైలవరం మండలం తాడవ గ్రామం కాగా..మనోహర్ది అనంతపురం జిల్లా ధర్మవరం. ఇద్దరి మృతదేహాలను వెలికి తీసి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement


