రాష్ట్రంలో వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను స్వల్ప వాయిదా వేయనున్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే నెల 3 నుంచి ప్రారంభం కావాల్సిన ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలను స్వల్ప వాయిదా వేయనున్నారు. వీటిని 5వ తేదీ నుంచి నిర్వహించాలన్న నిర్ణయానికి ఇంటర్మీడియెట్ బోర్డు వచ్చింది. జీఎహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ఈ మార్పులు చేసేందుకు చర్యలు చేపట్టింది. వచ్చే నెల 2న ఎన్నికలు ఉండటం, ఎన్నికల విధుల్లో పాల్గొనే ఇంటర్మీడియెట్ అధికారులు, సిబ్బంది ఆ రోజు రాత్రి వరకు అక్కడే ఉండాల్సి ఉంటుంది. దీంతో 3న సెలవు ప్రకటించే అవకాశం ఉంది. పైగా ప్రాక్టికల్ పరీక్షలకు హాజరయ్యే సిబ్బంది రెండు రోజుల ముందుగా రిపోర్టు చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో 3 నుంచి ప్రాక్టికల్స్ నిర్వహణ సాధ్యం కాదని బోర్డు అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి నుంచే కాకుండా నల్లగొండ, మహబూబ్నగర్, మెదక్ జిల్లాల నుంచి కూడా ఇంటర్మీడియెట్ విభాగం సిబ్బందికి ఎన్నికల విధులు వేశారు. అయినా 4 వేల మంది సిబ్బంది కొరత ఉన్నందున కరీంనగర్, వరంగల్ నుంచి కూడా ఇంటర్ సిబ్బందిని తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రాక్టికల్ పరీక్షల వాయిదా తప్పడం లేదని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. 1,300 కేంద్రాల్లో పరీక్షలు ఉంటాయి. 2.42 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. మరోవైపు ఈనెల 28న ఎన్విరాన్మెంటల్ సైన్స్, 30న మోరల్ సైన్స్ పరీక్షలు యథావిధిగా జరిగే అవకాశం ఉంది.