టీవీక్షణం: ఈసారి ఝలక్ ఇచ్చేది ఎవరో!

టీవీక్షణం: ఈసారి ఝలక్ ఇచ్చేది ఎవరో!


ఒకప్పుడు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్‌ని మనవాళ్లు చాలా ఆసక్తిగా చూసేవారు. ప్రతివారం దాని కోసం ఎదురు చూసేవారు. ఎందుకంటే అప్పుడు మనకు అలాంటి డ్యాన్స్ షోలు కొత్త. కానీ ఇప్పుడు టీవీ ఆన్ చేస్తే చాలు... ప్రతి చానెల్లోనూ అలాంటి ప్రోగ్రాములు బోలెడన్ని కనిపిస్తున్నాయి. పిల్లలకొకటి, పెద్దవాళ్లకొకటి, సెలెబ్రిటీలకొకటి, సెలెబ్రిటీ భార్యాభర్తలకొకటి.... రకరకాల థీమ్స్‌తో డ్యాన్స్ షోలు ప్రసారమవుతున్నాయి. అయితే ఏవో కొన్ని మాత్రమే ప్రత్యేక రీతిలో సాగి ప్రేక్షకులను అలరిస్తున్నాయి. చానెళ్లకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. అలాంటి షోలన్నింటిలోకీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది... ‘ఝలక్ దిఖ్‌లాజా’ గురించి!

 

 యూకేలోని ‘బీబీసీ ఒన్’ చానెల్లో ప్రసారమయ్యే ‘స్ట్రిక్ట్‌లీ కమ్ డ్యాన్సింగ్’ షో కాన్సెప్ట్ ఆధారంగా చేసుకుని రూపొందించిందే ‘ఝలక్ దిఖ్‌లాజా’. కలర్స్ చానెల్‌వారు 2006లో దీన్ని ప్రారంభించారు. ఇప్పటికి ఆరు సిరీస్‌లు పూర్తయ్యాయి. ప్రముఖ సెలెబ్రిటీలను పోటీదారులుగా తీసుకొచ్చి, వాళ్లతో ఆడించి, అలరిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నారు. గెలిస్తే పేరుతో పాటు, పెద్ద మొత్తంలో ప్రైజ్ మనీ లభిస్తుంది కాబట్టి సెలెబ్రిటీలు కూడా పోటీపడుతుంటారు ఈ షోలో పాల్గొనడానికి. ప్రముఖ నటి మాధురీ దీక్షిత్, దర్శకుడు కరణ్ జోహార్, కొరియోగ్రాఫర్ రెమోఫెర్నాండెజ్‌లు న్యాయ నిర్ణేతలు కావడం కూడా షోని నంబర్‌వన్ పొజిషన్లో నిలబెట్టింది.

 

 ఇటీవలే ప్రారంభమైన ఏడో సిరీస్‌లో కూడా ఫేమస్ సెలెబ్రిటీలే ఉన్నారు. బెట్టింగుల కారణంగా అరెస్టయ్యి వార్తలకెక్కిన శ్రీశాంత్, ‘రంగ్ రసియా’ సీరియల్ హీరో ఆశిష్ శర్మ, ‘పలక్’గా ‘కామెడీ నైట్స్ విత్ కపిల్’లో కడుపుబ్బ నవ్విస్తోన్న కికు షర్దా, ప్రముఖ గాయకుడు సుఖ్వీందర్ సింగ్, డ్యాన్సర్ శక్తీమోహన్... ప్రముఖ వీజేలు సోఫియా చౌదరి, ఆండీ... టీవీ నటీనటులు కరణ్ థాకర్, క్రితికా కామ్రా, పూరబ్ కోహ్లీ, పూజాబోస్, మౌనీ రాయ్... దబాంగ్ డ్యాన్స్‌తో ‘ఇండియాస్ గాట్ ట్యాలెంట్’ ద్వారా చెప్పలేనంత పాపులర్ అయిన చిట్టి డ్యాన్సర్ అక్షత్‌సింగ్‌లు ఈ సిరీస్‌లో పోటీ పడనున్నారు. మరి వీళ్లలో అసలు సిసలు ఝలక్ ఇచ్చేదెవరో... విజేతగా నిలిచేది ఎవరో!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top