శుభమణ్యేశ్వరుడు | Subhamanyesvarudu | Sakshi
Sakshi News home page

శుభమణ్యేశ్వరుడు

Dec 8 2013 12:25 AM | Updated on Sep 2 2017 1:22 AM

పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన కుమారస్వామి కారణజన్ముడు. తారకాసురుడనే లోకకంటకుడైన రాక్షసుని సంహరించడం కోసం జన్మించినవాడు.

శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహనం షడాననం... దారుణం రిపు రోగఘ్నం భావయే కుక్కుటధ్వజం స్కంధం షణ్ముఖం దేవం శివతేజం ద్విషడ్భుజం... కుమారం స్వామినాథం తం కార్తికేయం నమామ్యహం
 
 పార్వతీపరమేశ్వరుల పుత్రుడైన కుమారస్వామి కారణజన్ముడు. తారకాసురుడనే లోకకంటకుడైన రాక్షసుని సంహరించడం కోసం జన్మించినవాడు. తనను భక్తితో కొలిచిన వారికి  నాయకత్వ సిద్ధి, విజయప్రాప్తి, వ్యాధినివారణ, సంతానలాభం, భూప్రాప్తి శీఘ్రంగా సిద్ధింపజేస్తాడు. మార్గశిర శుద్ధ షష్ఠి తిథి ఆయనను పూజించడానికి సర్వోత్తమమైనది.

ఈరోజున ఆ స్వామిని షోడశోపచారాలతో పూజించినవారికి సంతానప్రాప్తి కలుగుతుందని శాస్త్రోక్తి. కృత్తిక నక్షత్రాన జన్మించినందువల్ల, కార్తికేయుడని, రెల్లుపొదలలో పుట్టినందువల్ల శరవణభవుడని, ఆరుముఖాలుండటం వల్ల షణ్ముఖుడని... ఇంకా స్కందుడని, సేనాని అని, సుబ్రహ్మణ్యేశ్వరుడనే నామాలతో కూడా ప్రసిద్ధుడు. శ్రీవ ల్లి, దేవసేన ఆయన భార్యలు. సుబ్రహ్మణ్యేశ్వరుని వాహనం నెమలి.

ఆరుముఖాలతో, ఎనిమిది భుజాలతో, అపారమైన ఆయుధాలతో దర్శనమిచ్చే కార్తికేయుడు మార్గశిర శుద్ధషష్ఠినాడు మాత్రం సర్పరూపంలో దర్శనమిస్తాడు. ఆ రోజు ఆయనను సర్పరూపునిగా కొలవడం, షోడశోపచారాలతో పూజించి పుట్టలో పాలు పోయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రతీతి. తమిళనాడు, పళనిలోని సుబ్రహ్మణ్యాలయం, రాష్ట్రంలోని మోపిదేవి, తిరుపతి, స్కందగిరి తదితర ప్రముఖ సుబ్రహ్మణ్య క్షేత్రాలన్నింటిలోనూ స్వామివారికి విశేష పూజలు, ఆరాధనలు జరుగుతాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement