చేలల్లో నీలిమ

Special story to Widows of Vidarbha Author - Sakshi

జర్నలిస్టు, రచయిత్రి అయిన నీలిమ ఈ మధ్యే ‘విడోస్‌ ఆఫ్‌ విదర్భ’ అనే పుస్తకం రాసింది. ఆక్స్‌ఫర్డ్‌ ప్రచురణ. ఈ పుస్తకం ఇటీవలే విడుదలైంది.తెలంగాణ వ్యవసాయ పరిస్థితులు, రైతుల స్థితిగతుల మీద అధ్యయనం చేయడానికి హైదరాబాద్‌ వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడితే చాలా  విషయాలను పంచుకుంది. వాటిలోని విశేషాంశాలివి. 

2001.. జూలై. ఫూలన్‌ దేవి హత్య జరిగిన రెండు రోజుల తర్వాత ఆమె హత్యకు పాల్పడ్డ షేర్‌ సింగ్‌ రాణా లొంగిపోనున్నాడనే వార్తలు మొదలయ్యాయి. అప్పటికే ఇన్వెస్టిగేటివ్‌ రిపోర్టింగ్‌లో మంచిపేరు తెచ్చుకున్న ముప్పై ఏళ్ల యంVŠ  జర్నలిస్ట్‌ ఒక అమ్మాయి తన ప్రశ్నలతో షేర్‌ సింగ్‌ రాణాను ఎన్‌కౌంటర్‌ చేయడానికి ప్రయత్నిస్తోంది. అతను డెహ్రాడూన్‌ వైపు గాని, రూర్కీ వైపు గాని వెళ్లి ఉండొచ్చు అని పోలీసుల ఊహాగానాలు. ఆ ప్రాంతాల్లోని పోలీస్‌ స్టేషన్స్‌ అన్నీ అలెర్ట్‌ అయ్యాయి. కానీ ఆ అమ్మాయిలో ఏదో సందేహం? అతను ఆ రెండు ప్రాంతాల వైపు కాకుండా... తనింటికి దగ్గర్లోని పోలీస్‌స్టేషన్‌లోనే సరెండర్‌ అవుతాడని. అందుకే అతని ఇంటికి దగ్గర్లో ఉన్న పోలీస్‌స్టేషన్‌ మీదే దృష్టి పెట్టింది. ఆమె అనుమానం నిజమైంది. వెంటనే ఆ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ షేర్‌ సింగ్‌ రాణా ఉన్నాడు! గబగబా ప్రశ్నల పరంపర సంధించింది. పదిహేను నిమిషాలకు మిగతా మీడియాకు ఉప్పంది, అక్కడికి వచ్చి వాలింది. కానీ రాణాను మొదట పట్టుకున్న ఘనత ఆమెకే దక్కింది. ఆమె కెరీర్‌లో ఇలాంటివి ఎన్నో! 2జీ స్పెక్ట్రమ్, నార్కోటిక్స్‌ నుంచి రాజకీయ కుట్రల దాకా ఎన్నెన్నో రిపోర్టింగ్స్‌.. చెప్పుకుంటూ వెళితే చాలానే! ఆమే నీలిమ. 

‘ది స్టేట్స్‌మన్‌’లో తొలి ఉద్యోగం
కోట నీలిమ పుట్టింది విజయవాడలో. పెరిగింది ఢిల్లీలో. తండ్రి కేవీఎస్‌ రామశర్మ. ఆయనా జర్నలిస్టే. నేషనల్‌ హెరాల్డ్‌కి ఎడిటర్‌గా పనిచేశారు. తల్లి ఉమా శర్మ. రచయిత్రి. ప్రపంచాన్ని ఎలా చూడాలో నాన్న ద్వారా నేర్చుకుంది నీలిమ. అమ్మ వల్ల ఊహాత్మక శక్తి పెరిగింది. ఈ రెండూ తన వృత్తికి ఎంతగానో ఉపయోగపడ్డాయి అంటుంది నీలిమ. అసలు తను జర్నలిస్ట్‌ అవడానికి ప్రేరణ మాత్రం తండ్రి నుంచే వచ్చింది అని చెప్తుంది. ఢిల్లీలో చదువు. అమెరికాలో పీహెచ్‌డీ చేసింది. జర్నలిస్ట్‌గా  మొదట పెన్ను పట్టింది ‘‘ది స్టేట్స్‌మన్‌’’ పత్రికలో.  తర్వాత ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్, ది సండే గార్డియన్‌లకు పనిచేసింది. ప్రస్తుతం ది హఫింగ్‌టన్‌ పోస్ట్, డైలీ ఓ, డీఎన్‌ఏ, న్యూస్‌ 18లకు కాలమిస్ట్‌గా వ్యాసాలు రాస్తోంది. ఆమె దృష్టి అంతా పాలిటిక్స్, పాలసీస్, జెండర్, రైతుల మీదే. 

 పత్రికల విధానాలు నచ్చలేదు!
2001–02 మధ్య.. హఠాత్తుగా రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్నట్టు గమనించింది నీలిమ. దేశానికి అన్నం పెట్టే రైతు బలవంతంగా ప్రాణం తీసుకునేదాకా వెళ్లాడంటే ఎంత దారుణమైన పరిస్థితులున్నట్టు! వాళ్లకోసం విధానాలు రూపొందించే యంత్రాంగానికి క్షేత్రస్థాయి వాస్తవాలు తెలుసా? రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చర్యలు చేపడుతుందో కనీసం రైతులకన్నా తెలుసా? వీటి గురించి కదా తను రిపోర్ట్‌ చేయాలి. వీటిని కదా.. మీడియా బ్యానర్లు రాయాలి. కానీ వాస్తవం దీనికి విరుద్ధంగా ఉంది. నిజాన్ని చెప్పాలి అంటే తాను పనిచేస్తున్న పత్రికల పాలసీకి భిన్నంగా నడవాలి. అందుకే రాజీనామా చేయాలనుకుంది నీలిమ. వెంటనే నెలవారీ ఖర్చులు, ఈఎమ్‌ఐలు, కట్టవలసిన లోన్‌లు కళ్లముందు కనిపించాయి. ఉద్యోగం వదిలేసి పూర్తిగా రైతుల ఆత్మహత్యల రీసెర్చ్‌ మీదే ఉండాలంటే ఇంకో ఇన్‌కమ్‌ సోర్స్‌కావాలి. అదేంటి? ఈ సంఘర్షణతో మరో రెండేళ్లు గడిచాయి. 

ఉద్యోగం మాని, విదర్భకు 
నీలిమ పెయింటర్‌ కూడా. ఉపనిషత్‌ల సారమే ఆమె పెయింటింగ్స్‌ థీమ్‌. దేశవిదేశాల్లో ఎగ్జిబిషన్స్‌ పెడ్తుంది. అప్పుడనిపించింది.. ఆదాయం కోసం ఈ కళనే ఉపయోగించుకోవాలని. రైతుల ఆత్మహత్యల పరిస్థితుల మీద రీసెర్చ్‌ను ఖరారు చేసుకుంది. 2004లో ఉద్యోగానికి రాజీనామా చేసి మహారాష్ట్రలోని విదర్భ బయలుదేరింది. అంతకుముందు మన దేశ వ్యవసాయం, పద్ధతులు, నష్టాలు వగైరా అన్నిటి మీద వచ్చిన పుస్తకాలు, శాస్త్రీయ పరిశోధనలన్నిటినీ అక్కడ చదివింది. తన పరిశోధనను సాగించింది. ఆ శోధననంతా పాఠ్యాంశంగా చెబితే ప్రజలకు పట్టదనీ గ్రహించింది. అందుకే వాటిని కథల రూపంలో, నవలల రూపంలో రాసింది. అలా రాసిన మొదటి పుస్తకం ‘‘రివర్‌స్టోన్స్‌’’. వ్యవసాయాన్ని, రైతుల ఆత్మహత్యలను ప్రభుత్వ పాలసీలు ఎంత నిర్లక్ష్యం చేశాయో నవలారూపంలో వివరించిన పుస్తకం అది. 2007లో అచ్చయింది. రెండో పుస్తకం ‘‘డెత్‌ ఆఫ్‌ ఎ మనీలెండర్‌’’ 2009లో వచ్చింది. పల్లెల్లో పేదరికాన్ని పట్టించుకోకుండా వదిలేసిన మెయిన్‌ జర్నలిజం మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రం ఆ పుస్తకం. 2013లో మూడో పుస్తకం ‘‘షూస్‌ ఆఫ్‌ ది డెడ్‌’’ని రాసింది. పొలిటికల్‌ బుక్‌గా అది బాగా పాపులర్‌ అయింది. పల్లెల్లోని యువత, నగరంలోని యువత మధ్య ఉండే వ్యత్యాసాన్ని.. దానికి కారణమైన వ్యవస్థకు నీలిమ అద్దం పట్టిందీ నవలలో. 2016లో ‘‘ది హానెస్ట్‌ సీసన్‌’’ను రాసింది. పార్లమెంట్‌ నాలుగు గోడల మధ్య జరిగే డీల్స్‌ను బహిర్గతం చేసిందీ పుస్తకంలో.  ఆమె రాసిన ‘‘షూస్‌ ఆఫ్‌ ది డెడ్‌’’నవలను ప్రముఖ తమిళ దర్శకుడు వెట్టిమారన్‌ సినిమాగా కూడా రూపొందించబోతున్నాడు. ఇదీ కోట నీలిమ రచయిత్రిగా మారిన తీరు. 

ది గ్రేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌
నీలిమ పుస్తకాలన్నీ ఇంగ్లిష్‌లోనే ఉన్నాయి. కారణం తనకు తెలుగు అంత గొప్పగా రాయడం రాకపోవడమే అంటారు. ‘‘చిన్నప్పుడు మా నాన్న గారు మాకు తెలుగు నేర్పే విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉన్నారు. ఏదైనా తెలుగు పుస్తకం ఇచ్చి చదవమని చెప్పేవారు. చాలా హార్డ్‌గా ఉంది నాన్నా అంటే అవునా అంటూ ‘వేయి పడగలు’ వంటి భారీ పుస్తకాన్ని తెచ్చి ముందు పెట్టేవారు. మేం మొహం తేలేస్తే.. ‘ఇప్పుడు ముందు ఇచ్చిన పుస్తకం తేలిగ్గా అనిపిస్తుంది కదా.. చదవండి’ అనేవారు. అలా తెలుగు నేర్పే విషయంలో ఎంత పట్టుదలగా ఉండేవారో.. పుస్తకాలు చదివే విషయంలో కూడా అంతే ఇదిగా ఉండేవారు. నా ఎనిమిదో యేటనే చార్ల్స్‌ డికెన్స్‌ ‘‘ది గ్రేట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌’ పుస్తకం ఇచ్చారు. అర్థంకాలేదు. మళ్లీ నాలుగేళ్లకు ఇచ్చారు చదవమని. అలా ఉంటుంది ఆయన ట్రైనింగ్‌. ఈ రోజు ఇలా ఉన్నామంటే అమ్మా, నాన్నే కారణం’’ అని గుర్తు చేసుకుంది నీలిమ. తెలుగు నేర్పాలని తండ్రి అంత ప్రయత్నించినా.. ఢిల్లీలో పెరగడం, వృత్తిరీత్యా ఇంగ్లిష్‌ భాషకే పరిమితమవడం వల్ల తెలుగు మీద పట్టు రాలేదు నీలిమకు. అందుకే తన పుస్తకాలను తెలుగులో అనువదించేందుకు.. ఇంకా చెప్పాలంటే ఇతర భారతీయ భాషల్లో అనువదించేందుకూ ప్రయత్నిస్తోంది. 

సమస్యలపై ‘స్టూడియో అడ్డా’
ప్రస్తుతం తెలంగాణ రైతు సమస్యలు, చేనేత కార్మికుల అవస్థలు, గల్ఫ్‌ వలసల గురించీ అధ్యయనం చేయడానికి హైదరాబాద్‌ వచ్చింది. ‘‘తెలంగాణలోనూ రైతుల ఆత్మహత్యలు భయం కలిగిస్తున్నాయి. ముందు నేను తెలంగాణ పల్లెలన్నీ తిరగాలనుకుంటున్నాను’’ అంది నీలిమ. ఇంకోవైపు ‘‘స్టూడియో అడ్డా’’ అనే సంస్థనూ స్థాపించి.. సోషల్‌  ఫారమ్‌గా మలిచింది. ఎవరైనా ఆ సంస్థలో ఎన్‌రోల్‌ చేసుకోవచ్చు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా ఉన్న అన్ని అంశాలు, సమస్యలు చర్చిస్తారు. ఆర్ట్‌ ఎగ్జిబిషన్స్‌నూ ఆమె కండక్ట్‌ చేస్తోంది. ఇదీ కోట నీలిమ మల్టీ టాస్కింగ్‌. 

విడోస్‌ ఆఫ్‌ విదర్భ
నాలుగు పుస్తకాలు రాశాక నీలిమ ఆలోచన మారింది. ఇంత రీసెర్చ్‌లో ఆమెకు విషయాలన్నీ చెప్పింది చనిపోయిన రైతుల భార్యలు, తల్లులే. బరువు, బాధ్యతలను  వదిలేసి ఆత్మహత్యతో రైతులు సాంత్వన పొందితే వాటన్నిటినీ నెరవేరుస్తున్నది ఈ ఆడవాళ్లే. అప్పులు తీర్చి, పిల్లలకు చదువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసి జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. అలాంటి వాళ్ల స్ట్రగుల్‌ని కదా చెప్పాలి అనుకుంది. అందుకే ‘‘విడోస్‌ ఆఫ్‌ విదర్భ’’గా పుస్తకాన్ని తెచ్చింది. ‘‘ఈ పుస్తకం రాయడానికి నాలుగేళ్లు పట్టింది. ముందు 100 కేస్‌స్టడీస్‌ తీసుకున్నా.. అందులోంచి 50 ఎంచుకొని అందులోంచి మళ్లీ పద్దెనిమిది తీసుకున్నా. ఆ పద్దెనిమిది మంది జీవితాలు ఒకేరకంగా లేవు. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా జీవితాన్ని లీడ్‌ చేస్తున్నారు. ఎవరూ ఎక్కడా ఆత్మగౌరవాన్ని కోల్పోలేదు. ధైర్యంగా నిలబడ్డారు. వాళ్లను చూస్తే.. వాళ్ల కథలు వింటే చాలా ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుంది. వాళ్లకున్నంత సెల్ఫ్‌ ప్రైడ్, సెల్ఫ్‌రెస్పెక్ట్‌ అర్బన్‌ విమెన్, ఈవెన్‌ వర్కింగ్‌ క్లాస్‌ విమెన్‌కి కూడా ఉండదనిపించింది. చాలా నార్మల్‌ లేడీస్‌.. చదువు లేదు.. బయటి ప్రపంచం తెలియదు.. ఆర్థికంగా ఎలాంటి అండలేని వాళ్లు.. అయినా వాళ్లు నిలబడ్డ తీరు.. అద్భుతం! వాళ్ల భర్తలు చేసిన పనే వాళ్లు చేసి ఉంటే ఎన్ని కుటుంబాలు రోడ్డున పడేవి?’’ అంటూ తన పుస్తక నేపథ్యాన్ని వివరించింది నీలిమ.  
– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top