ప్రెగ్నెన్సీని ప్లాన్‌  చేసుకోవాలనుకుంటున్నారా?

Healthy food should be taken during pregnancy - Sakshi

 కపుల్‌ కౌన్సెలింగ్‌

ఇప్పుడంతా ప్రణాళికాబద్ధంగా జరిగే కాలం. యువతీ యువకులకు తమ కెరియర్‌ ప్లానింగ్‌లో టైమే తెలియడం లేదు. దాంతో వారికి అనువైన సమయంలో ప్రెగ్నెన్సీ కావాలనుకుంటే... అప్పుడు మనోరథం నెరవేరకపోతే సమస్యే కదా. అలాంటి సమస్యలేమీ రాకుండా... తాము కోరుకున్నట్లే పాపనో, బాబునో పొందడం కోసం దంపతులకు కొన్ని తేలికపాటి జాగ్రత్తలివే!

►కాబోయే తల్లి దండ్రులిద్దరూ ప్లానింగ్‌ చేసుకున్ననాటి నుంచి మంచి ఆరోగ్యకరమైన సమతులాహారం తీసుకోవాలి. అదీ వేళకు తింటూ ఉండాలి. అన్ని రకాల పోషకాలు అందేలా రకరకాల కూరగాయలు, ఆకుకూరలు, తాజాపండ్లు ఎక్కువగా తీసుకోవాలి. 

►డాక్టర్‌ను సంప్రదించి ఫోలిక్‌ యాసిడ్‌ వంటి సప్లిమెంట్స్‌ తీసుకుంటూ ఉండండి. ఇవి తీసుకోవడం వల్ల బిడ్డల్లో పుట్టుకతో వచ్చే అనేక లోపాలను నివారించవచ్చు. 

►నిత్యం ఆహ్లాదకరమైన, సంతోషభరితమైన వాతావరణంలో ఉండండి. ఆహ్లాకరమైన సంగీతం వింటూ, టీవీ చూస్తున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రాములే చూస్తూ ఉండండి. ఎప్పుడూ సానుకూల దృక్పథం (పాజిటివ్‌ యాటిట్యూడ్‌)తో ఉండండి. 

►ఒత్తిడి ఎక్కువగా ఉండే వృత్తుల్లో ఉండేవారు వీలైతే కొద్ది రోజులు దాని నుంచి దూరంగా ఉండండి. ఇందుకోసం వీలైతే మళ్లీ మరో హనీమూన్‌కు వెళ్లిరండి. 

►యువతుల్లో పీరియడ్స్‌ వచ్చిన 11వ రోజు నుంచి 18వ రోజు వరకు రోజూ సెక్స్‌లో పాల్గొనండి. ఈమధ్య రోజుల్లోనే అండం విడుదల (ఓవ్యులేషన్‌) జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో జరిగే కలయిక వల్లనే గర్భధారణ జరుగుతుంది. 

►ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకునే ముందుగా వీలైతే – మహిళలైతే పీసీఓ వంటి సమస్యలు ఉన్నాయేమోనని, పురుషులైతే స్పెర్మ్‌ కౌంట్‌ వంటి పరీక్షలు చేయించుకోవడం చాలా మేలు చేసే అంశం. అలాంటప్పుడు సమయం వృథాపోకుండా కొన్ని అవసరమైన చికిత్సలు అంది, మీ ప్లానింగ్‌ విజయవంతమవుతుంది. 

చేయకూడనివి... 
►ఆహార పదార్థాల్లో ఉప్పు, చక్కెర, మసాలాలు, నూనెలు తక్కువగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. 

►ఈ టైమ్‌లో పురుషులు లాప్‌టాప్‌ను తమ ఒడిలో పెట్టుకుని పనిచేయడం లేదా తమ మొబైల్‌ఫోన్‌ను ప్యాంట్‌ జేబులో ఉంచుకోవడం... ఈ రెండుపనులూ చేయకూడదు. (ఇవి శుక్రకణాల నాణ్యతను దెబ్బతీస్తాయనే అంశం ఇంకా నిర్ధారణ కాలేదు. కాబట్టి ఆ విషయంలో ఆందోళన వద్దు. అయితే స్పెర్మ్‌ నాణ్యత బాగుండటం కోసం ప్రకృతి కొన్ని మంచి ఏర్పాట్లు చేసింది. మనంతట మనమే అక్కడ ఉష్ణోగ్రత పెరిగేందుకు ఆస్కారం ఇస్తే ఎలా? అందుకే ల్యాప్‌టాప్‌తో పనిచేయడం వల్ల వాటి ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం లేదా అవి మందకొడిగా మారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టే ఈ జాగ్రత్త).

►దంపతులిద్దరూ గర్భధారణ సక్రమంగా జరగడానికి కృషి చేయాలి. కడుపు పండటానికి అంటూ కొందరు... పల్లెటూళ్లలో ఇచ్చే నాటుమందులనూ, హెర్బల్‌ మందులను సిఫార్సు చేస్తుంటారు. మీ డాక్టర్‌ సలహా లేకుండా అలాంటివేమీ వాడకండి. అవి మీ ప్రత్యుత్పత్తి వ్యవస్థను దెబ్బతీయవచ్చు. 

►సోయా ఉత్పాదనలు, టోఫూ వంటి వాటిని ఎక్కువపాళ్లలో తీసుకోవద్దు. 

►ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్న తర్వాత దంపతులు మద్యపానం, పొగతాగడం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. టీ, కాఫీ వంటి పానీయాలను కూడా చాలా పరిమితంగా తీసుకోవడమే మంచిది. 

►ప్రెగ్నెన్సీ ప్లాన్‌ చేసుకున్న తర్వాత తొలినాళ్లలోనే గర్భధారణ జరగకపోతే అంతలోనే నిరాశ వద్దు. కనీసం ఏడాదిపాటైనా ప్రయత్నించాక... అప్పుడు మాత్రమే డాక్టర్‌ను సంప్రదించాలి. 
 

పార్కిన్‌సన్స్‌ వ్యాధి అంటే ఏమిటి? 
పార్కిన్‌సన్స్‌ కౌన్సెలింగ్స్‌
మా తాతగారి వయసు 68 ఏళ్లు. ఈమధ్య చాలా బలహీనంగా తయారయ్యారు. చేతులు, కాళ్లు, తల చాలా ఎక్కువగా వణుకుతున్నాయి. మాట్లాడే విధానం కూడా మారింది. ఇదివరలో ఎన్నడూలేనంత గంభీరంగా తయారయ్యారు. ఎంతో ఇష్టంగా తినే వంటలు కూడా ఏమాత్రం ఇష్టం లేదంటున్నారు.

ఏం పెట్టినా రుచిలేని తిండి పెడుతున్నారంటూ లేచి వెళ్లిపోతున్నారు. మాకు దగ్గర్లోని పెద్దాసుపత్రిలో చూపిస్తే పార్కిన్‌సన్స్‌ వ్యాధి వస్తున్నట్లు కనిపిస్తోందని స్పెషలిస్టు డాక్టర్‌కు చూపించమని చెప్పారు. పార్కిన్‌సన్స్‌ వ్యాధి అంటే ఏమిటి? ఈ వ్యాధి ఎందుకు వస్తుంది? చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి
– ఎ. సందీప్, కరీంనగర్‌

పార్కిన్‌సన్స్‌ అనేది నరాలకు సంబంధించిన వ్యాధి. మెదడులో డోపమైన్‌ అనే రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీకణాలు దెబ్బతినడం, క్షీణించడం కారణంగా ఇది వస్తుంది. డోపమైన్‌ మెదడులోని వివిధ భాగాలకూ... శరీరంలోని నాడీ వ్యవస్థకు మధ్య సమాచార మార్పిడి (కమ్యూనికేషన్‌)కి తోడ్పడే కీలకమైన రసాయనం. దీనికి తయారుచేసే కణాలు క్షీణించడం వల్ల మెదడు దేహంలోని అవయవాలను అదుపుచేయగల సామర్థ్యాన్ని కోల్పోతుంది. దాంతో శరీరభాగాలు ప్రత్యేకించి చేతులు, కాళ్లు, తల వణుకుతుంటాయి. శరీరంలోని కండరాలు బిగుతుగా తయారవుతాయి. మాట్లాడే విధానంలో తీవ్రమైన మార్పులు వస్తాయి. వ్యక్తి బలహీనంగా తయారవుతాడు. ఈ వ్యాధి నెమ్మదిగా పెరుగుతూ తీవ్రస్థాయికి చేరుకుంటుంది. సాధారణంగా అరవై ఏళ్లకు పైబడ్డవారే ఎక్కువగా పార్కిన్‌సన్స్‌ వ్యాధికి గురవుతుంటారు. కొన్ని కుటుంబాల్లో మాత్రం ఇది వంశపారంపర్యంగా వస్తూ, చిన్న వయసు వారిలోనూ కనిపిస్తుంటుంది.

మన దేశంలో దాదాపు కోటికి పైగా మంది దీనితో బాధపడుతున్నారు. సరైన సమయంలో డాక్టర్‌ను సంప్రదించి ఆధునిక సౌకర్యాలు ఉన్న పెద్ద ఆసుపత్రిలో చికిత్స చేయించుకోవడం ద్వారా దీన్ని అదుపు చేయడానికి వీలుంటుంది. పార్కిన్‌సన్స్‌ వ్యాధి చికిత్స ఇటీవల సమూలంగా మారిపోయింది. ఈ వ్యాధిగ్రస్తులు తమను వేధిస్తున్న లక్షణాలను అదుపు చేసుకొని, సాధారణ జీవితం గడిపేందుకు ఇదివరకు ఎన్నడూ లేని స్థాయిలో వైద్యపరమైన ఔషధాలు, సర్జికల్‌ చికిత్సలు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. పార్కిన్‌సన్స్‌ వ్యాధి మధ్యస్థాయిలో ఉండి శరీరక పరిమితులు ఎదుర్కొంటున్న వ్యక్తుల్లో వ్యాధి లక్షణాలను అదుపు చేయటంతో పాటు వాడుతున్న మందుల నుంచి గరిష్ఠప్రయోజనం పొందేందుకు ఇప్పుడున్న ఆధునిక చికిత్సలు తోడ్పడుతున్నాయి. 

చికిత్స : ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపు చేసి, వ్యాధిగ్రస్తులు సాధారణ జీవితాలు గడిపే లక్ష్యంగా ఈ చికిత్స జరుగుతుంటుంది. ఇందుకుగాను వ్యాధి తీవ్రత, రోగి ఆరోగ్యపరిస్థితి, శరీరతత్వాన్ని దృష్టిలో పెట్టుకుని చికిత్స వ్యూహాన్ని రూపొందించాల్సి ఉంటుంది. ఇందుకు మందులు, ఫిజియోథెరపీ, అవసరాన్ని బట్టి శస్త్రచికిత్స ఉపయోగపడతాయి. దాదాపు నాలుగు దశాబ్దాల కిందట కనిపెట్టిన ‘ఎల్‌ డోపా’ అనే ఔషధం వణుకుడు వ్యాధికి సమర్థంగా పనిచేస్తున్నది. శక్తిమంతమైన ఈ మందును డాక్టర్ల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుంది. లేనిపక్షంలో మోతాదులో ఏవైనా లోటుపాట్లు జరిగితే మొత్తంగా మెదడు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది మెదడులోని ముఖ్యమైన నాడీకణాలకు సహాయపడుతూ డోపమైన ఉత్పత్తి జరిగేట్లు చేస్తుంది. దాంతో అవయవాలు బిగుసుకుపోవడం, వణుకుడు తగ్గుతుంది.

డీబీఎస్‌ శస్త్రచికిత్స అంటే? 
మా మామగారికి 60 ఏళ్లు. చేతి వేళ్లలో వణుకు మొదలైంది. ఆపైన చేయి, కాలు వణుకుతుంటాయి. ఏ పనీ చేయకుండా ఉన్న సమయంలో కూడా చేతివేళ్లు, చెయ్యి, కాళ్లు, సెకనుకు నాలుగైదుసార్లు వణుకుతుంటాయి. అదేవిధంగా చూపుడువేలు, బొటనవేలు లయబద్దంగా రాపిడికి గురవుతుంటాయి.

చేతులు, కాళ్లు వణికే ఈ పరిస్థితిలో నడవడం చాలా ఇబ్బందికరం అవుతోంది. డాక్టర్‌కి చూపిస్తే ఇవి పార్కిన్‌సన్‌ లక్షణాలుగా గుర్తించారు. ఈ వ్యాధిని నిరోధించడంలో ‘డీబీఎస్‌’ శస్త్రచికిత్స బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. డీబీఎస్‌ సర్జరీ అంటే ఏమిటి? దాంతో ఉపయోగం ఏమిటి? వివరంగా తెలపగలరు. 
– శ్రావణి, ఏలూరు 

పార్కిన్‌సన్స్‌ వ్యాధికి సంబంధించి చేసే చికిత్సల్లో డీబీఎస్‌ (డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌) కీలకమైన శస్త్రచికిత్స. పార్కిన్‌సన్స్‌ వ్యాధి పెరుగుదలను నిరోధించడంలో డీప్‌ బ్రెయిన్‌ స్టిమ్యులేషన్‌ (డీబీఎస్‌) శస్త్రచికిత్స ఎంతగానో తోడ్పడుతున్నట్లు గుర్తించారు. గుండెపనితీరును మెరుగుపరిచేందుకు పేస్‌మేకర్‌ అమర్చినట్లుగానే ఈ సర్జరీ ద్వారా మెదడులో ఎలక్ట్రోడ్‌ను అమరుస్తారు. ఇందుకుగాను ముందుగా ఎమ్మారై, సీటీస్కాన్‌ ద్వారా వ్యాధిగ్రస్తుల మెదడులో సమస్య ఎక్కడ ఏర్పడిందో గుర్తిస్తారు. ఆ పైన చిన్న ఎలక్ట్రోడ్‌ను అమరుస్తారు. దీనికి ఓ చిన్న బాటరీ–తీగ ఉంటాయి.

మెదడులోని కొన్ని కణాలను తొలగించడం, మరికొన్ని భాగాలకు ఎలక్ట్రిక్‌ షాక్‌ ఇవ్వడం ద్వారా వ్యాధి ముదరకుండా చేయగలుగుతారు. అలా డోపమైన్‌ తయారీని పునరుద్ధరించవచ్చు. పెద్దగా రక్తస్రావం జరగకుండా, ఇంజక్షన్లు అవకాశం లేకుండా పూర్తయ్యే ఈ శస్త్రచికిత్స వల్ల మెదడు... తన శరీర భాగాలను తన అదుపులోకి తెచ్చుకోవడం సాధ్యపడుతుంది. ఇది పార్కిన్‌సన్స్‌ వ్యాధి లక్షణాలను తీసివేయలేదు గానీ వాటిని అదుపులో ఉంచగలదు. ఇది సంక్లిష్టమైన, క్రమం తప్పకుండా న్యూరలాజికల్‌ ఫాలోఅప్‌ అవసరమైన శస్త్రచికిత్స. అయితే ఔష«ద చికిత్స అందిస్తున్నప్పటికీ, రోగి పరిస్థితి ఆమోదకరం కాని స్థితికి దిగజారినప్పుడు డీబీఎస్‌ ప్రభావశీలమైన ప్రత్యామ్నాయంగా కనిపిస్తుంది. 

డాక్టర్‌ ఆనంద్‌ బాలసుబ్రమణియమ్, సీనియర్‌ న్యూరోసర్జన్, 
యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్‌ 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top