గ్రహాలు పట్టించాయి

Family crime story in this week 21 nov 2018 - Sakshi

అనుమానితుడి ఊహాచిత్రాలను ఫిబ్రవరి 26న విడుదల చేశారు. కంజూర్‌మార్గ్‌ వైపు మార్గంలో ఉండే సీసీటీవీల ఫుటేజ్‌లన్నీ సేకరించారు. అటోవాలాలు, స్థానికులు, షాపు యజమానులు.. ఇలా అందరినీ విచారించడం ప్రారంభించారు. 

‘నా గ్రహాలు బాగున్నాయంటారా?’‘నీ చేష్టలు అనుకూలంగా ఉంటే గ్రహాలు నీకు అనుకూలంగా ఉంటాయ్‌’‘నా చేష్టలు చెడ్డవి అయితే?’‘గ్రహాలు పగబట్టి పట్టిస్తాయి’జనవరి 5.2014.ఫోన్‌ రాకపోతే వచ్చే టెన్షన్‌ ఎలా ఉంటుంది? అదీ మనం ఇష్టపడే మనిషి నుంచి అయితే? జన్మనిచ్చిన సంతానం నుంచి అయితే? మరీ ముఖ్యంగా ఆడపిల్ల నుంచి అయితే? ఆ తల్లిదండ్రులు ఆ టెన్షన్‌ అనుభవిస్తున్నారు. ఇప్పటికి 24 గంటలు గడిచి పోయాయి వాళ్ల కూతురి నుంచి ఫోన్‌ వచ్చి.24 గంటలంటే. ఆ అమ్మాయికి ఏం జరిగినట్టు?ఒకరోజు ముందు జనవరి 4, 2014. విజయవాడ.‘అనూ.. నీ రాకతో క్రిస్మస్, న్యూ ఇయర్‌ హ్యాపీగా గడిచిపోయాయి. ఇప్పుడు వెళుతున్నావ్, మళ్ళీ ఎప్పుడు వస్తావ్‌’ కూతురు అనూహ్య తలమీద చేయి వేసి ఆప్యాయంగా అడిగాడు తండ్రి.‘సమ్మర్‌లోనే డాడ్‌. అంటే ఇంకో ఫోర్‌ మంత్స్‌. అందుకే మీరే ముంబయ్‌ రండి..’ నవ్వుతూ బ్యాగ్‌ భుజానికి వేసుకుంది అనూహ్య. స్టేషన్‌కు బయల్దేరే సమయమైంది. అనూహ్య వారిస్తున్నా వినకుండా తల్లిదండ్రులిద్దరూ రైల్వేస్టేషన్‌కి వచ్చారు కూతురికి సెండాఫ్‌ ఇవ్వడానికి.‘తెల్లవారి ముంబై చేరగానే ఫోన్‌ చేయి’... జాగ్రత్తలు చెబుతూ ట్రెయిన్‌ కదిలేంతవరకు అక్కడే ఉండి, ఇంటి ముఖం పట్టారు తల్లీతండ్రి. 

ట్రైన్‌ బయలుదేరింది. తన ఉద్యోగం గురించి తలుచుకుంది అనూహ్య. మంచి ఉద్యోగం. ఇంకొన్నాళ్లు చేస్తే అమెరికాకు కూడా పంపిస్తారు. అమెరికాలో సెటిల్‌ కావాలి. అమ్మానాన్నలను తీసుకెళ్లాలి. ఎన్నో మంచి పనులు చేయాలి... కలలు.. ప్రతి సగటు మనిషి కనే కలలు... కాని ఆ కలలు కల్లలయ్యే దారుణ ఘడియలు ముందు ఉన్నాయా?మరుసటి రోజు.తెల్లవారి ఫోన్‌ కోసం ఎదురు చూశారు తల్లిదండ్రులు. రాలేదు. వాళ్లు చేశారు. స్విచ్‌డాఫ్‌ వచ్చింది. చార్జ్‌ అయిపోయి ఉంటుందని ఎదురు చూసి మళ్లీ చేశారు.స్విచ్‌డాఫ్‌. ఉదయం పదైపోయింది. ట్రైన్‌ ఏడుకల్లా చేరిపోతే ఇంకా ఫోన్‌ ఎందుకు చేయలేదు. హాస్టల్‌కు చేశారు.‘మీ అమ్మాయి ఇంకా రాలేదండీ’ అని చెప్పారు వాళ్లు.మనసు కీడు శంకించడం మొదలైంది.ఆఫీసుకు చేశారు.‘రాలేదే. మెసేజ్‌ కూడా లేదు’ అని చెప్పారు.కొన్ని ఊహాగానాలు.. కొన్ని సందేహాలు.. కొన్ని ఎదురుచూపులు... కొన్ని నిరీక్షణలు... కొన్ని ఆచూకీ యత్నాలు...24 గంటలు గడిచిపోయాయి.ఒక అమ్మాయి 24 గంటల పాటు ట్రేస్‌ కాలేదంటే పెద్ద ఉపద్రవం వచ్చినట్టు.వెంటనే పోలీసులను సంప్రదించారు. జనవరి 6న అనూహ్య కిడ్నాప్‌ అయినట్టు విజయవాడతో పాటు హైదరబాదులోనూ ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు ముంబై కుర్లా రైల్వేపోలీసులకు ముంబైలో ఉంటున్న అనూహ్య బంధువులు ఫిర్యాదు చేశారు. క్షణాల్లో వార్త మీడియాకు పొక్కింది. సాఫ్ట్‌వేర్‌ అమ్మాయి అదృశ్యం. ఆమె ఏమైంది? ఆమెకు ఏమైంది? 

ఫస్ట్‌ సోర్స్‌ పాసింజర్స్‌.ఆమెతో పాటు ప్రయాణించినవారి అడ్రస్‌లను తీసుకుని వారిని కలిసి అనూహ్య ఫొటో చూపించారు పోలీసులు. ‘ఈమె చివరి వరకూ ప్రయాణించిందా? మధ్యలో దిగిపోయిందా?’పోలీసుల అనుమానాలు పోలీసులకు ఉన్నాయి. ఏదైనా ప్రేమ వ్యవహారం వల్ల ఎవరైనా అబ్బాయితో వెళ్లిపోయి ఉండొచ్చనే యాంగిల్‌లో ఆరా తీశారు.‘ఈ అమ్మాయి లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌లోనే  దిగిందండీ’ అని ఒకరిద్దరు చెప్పారు. సో.. అనూహ్య ముంబై చేరింది. టెర్మినస్‌లో దిగింది. ఆ తర్వాత ఏమైంది? జనవరి 16.ముంబై–థాణే ఈస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కంజూరుమార్గ్‌ ప్రాంతంలో సర్వీసు రోడ్డు పక్కన పొదలలో ఏదో కుళ్లిన వాసన. స్థానికులు గమనిస్తే పొదల్లో యువతి శవం. కుళ్లిపోయిన స్థితిలో.పోలీసులు హడావిడిగా అక్కడకు చేరుకున్నారు. అది అనూహ్య శవమేనని తేలింది. ట్రెయిన్‌ దిగి నేరుగా అం«థేరి హాస్టల్‌ గదికి వెళ్లాల్సిన ఆమె కంజూర్‌మార్గ్‌వైపు ఎందుకు వెళ్లినట్టు? ఎవరితో వెళ్లింది..? శవం లభించిన స్థలం నుంచి మరో చోట అర కిలోమీటర్‌ దూరంలో ఆమె దుస్తులతో ఉన్న బ్యాగు లభ్యమైంది. అంటే ఆమె అక్కడే హత్యకు గురైంది. రెండు వారాల అన్వేషణ తర్వాత అనూహ్య శవమై తేలడంతో ముంబైతోపాటు దేశవ్యాప్తంగా ఈ సంఘటన సంచలనం రేకేత్తించింది. అనూహ్య శవం పోలీసులకు పెద్ద మిస్టరీగా మారింది. 

మెల్లగా నిరసన మొదలైంది.అనూహ్య బంధువులు, ముంబైలోని తెలుగు సంఘాలు, స్వచ్చంద సంస్థలు అనూహ్యను హత్య చేసిన నేరస్తుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనలు, కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టారు.పోలీసులపై పెద్ద ఎత్తున ఒత్తిడి పెరిగింది.జనవరి 30.పోలీసులు సీసీ టీ వీ ఫుటేజ్‌లను మళ్లీ మళ్లీ పరిశీలించడం మొదలుపెట్టారు.రైల్వే టెర్మినస్‌లోని ఒక సీసీటీవి ఫుటేజ్‌లో అనూహ్య బయటకు వెళ్తూ కన్పించింది. ఆమెతో పాటు మరో వ్యక్తి కూడా బయటికి వెళ్తూ కన్పించాడు. ఒకటికి నాలుగుసార్లు చెక్‌ చేశారు. పరిచయం ఉన్నట్టుగా ఆ వ్యక్తితో మాట్లాడుతూ వెళుతోంది.  ఆ వ్యక్తి ఎవరు..? ముందు నుంచే ఆ వ్యక్తి అనూహ్యకు తెలుసా..?  హత్య చేసింది ఆవ్యక్తేనా..?అనుమానితుడి ఊహాచిత్రాలను ఫిబ్రవరి 26న విడుదల చేశారు. కంజూర్‌మార్గ్‌ వైపు మార్గంలో ఉండే సీసీటీవీల ఫుటేజ్‌లన్నీ సేకరించారు. అటోవాలాలు, స్థానికులు,షాపు యజమానులు.. ఇలా అందరినీ విచారించడం ప్రారంభించారు. ఒకతను అతణ్ణి గుర్తుపట్టాడు.‘ఇతను చంద్రబాన్‌ సానప్‌ అలియాస్‌ లౌక్యా’ అన్నాడు.నాసిక్‌కు ఆరు కిలోమీటర్ల దూరంలోని మఖమలాబాద్‌ అతని ఊరు అని కూడా తేలింది.వెంటనే బిలబిలమంటూ పోలీసులు అక్కడకు వెళ్లారు. కాని అతడు అక్కడ లేడు.లౌక్యాను ఎలా పట్టుకోవాలి?మళ్లీ వేట మొదలైంది.అతడికి పరిచయం ఉన్నవారందరినీ పోలీసులు పట్టుకొచ్చి ప్రశ్నించడం మొదలుపెట్టారు.పెద్దగా వివరాలు దొరకలేదు.ఒకతను ‘సార్‌... అతనికి జాతకాల పిచ్చి. ముంబైలో ఒక సిద్ధాంతి దగ్గరకు తరచూ వెళుతుంటాడు’ అని చెప్పాడు.సిద్ధాంతిని వెతకడం పోలీసులకు కష్టం కాలేదు. ఫోటో చూపించారు.‘ఇతను ఈ మధ్యే వచ్చాడు. నీ టైమ్‌ బాగలేదని చెప్పాను. శాంతి జరిపించాలని చెప్పాను. మార్చి 2 డేట్‌ కూడా ఇచ్చాను’ అన్నాడు సిద్ధాంతి.పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. 2014 మార్చి 2న అంటే సంఘటన జరిగిన 50 రోజుల అనంతరం చంద్రబాన్‌ సానప్‌ను పోలీసులు గ్రహశాంతి జరగకమునుపే పట్టుకున్నారు. 

అరెస్టు అయిన చంద్రబాన్‌ ఈ కేసుకు సంబంధించి చిక్కుముడులన్నింటినీ విప్పాడు. నాసిక్‌కి చెందిన అతడు ఒక రైల్వే దొంగ. పలు రైల్వేస్టేషనలో సెల్‌ ఫోన్లు, లగేజీల దొంగతనాలు చేసేవాడుగా కేసులు ఉన్నాయి. కొంతకాలంగా ఈ పని మీదే ముంబైలో ఉంటుంన్నాడు.జనవరి 4న మిత్రులతో కలిసి మద్యం సేవించిన చంద్రబాన్‌ కుర్లాలోని లోకమాన్య తిలక్‌ టెర్మినస్‌కి వేకువజామునే దొంగతనానికి వచ్చాడు. కాని ఏం దొరకలేదు. అదే సమయంలో ఒంటరిగా ఉన్న అనూహ్యను చూశాడు. ‘ఎక్కడకు వెళ్లాలి?’ అని అడిగాడు.‘అంథేరి’ అందామె.‘300 ఇవ్వండి. దింపుతాను’ అన్నాడు. సాధారణంగా టాక్సీవాడు ఎక్కువ అడుగుతాడు. ఇతను తక్కువ అడగడంతో ఒప్పుకుని స్టేషన్‌ బయటకు వచ్చింది.పార్కింగ్‌ వద్దకు రాగానే అటోకు బదులుగా మోటార్‌ సైకిల్‌ ఉండడంతో అనూహ్య ‘ఇదేంటి?’ అంది. ‘మీకు ఎలాంటి భయంలేదు. కావాలంటే నా ఫోన్‌ నెంబరు, మోటర్‌ సైకిల్‌ నెంబరు కూడా తీసుకోండి’ అని చెప్పి ఆమెను ఒప్పించాడు. అప్పటికే ప్రయాణం వల్ల అలసిపోయిన ఆమె త్వరగా హాస్టల్‌ చేరాలనే ఆలోచనతో అతనితో మోటర్‌ సైకిల్‌పై వెళ్లేందుకు అంగీకరించింది. మోటార్‌ సైకిల్‌పై ఈస్టర్న్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేపై కంజూర్‌మార్గ్‌ వరకు వెళ్లిన తర్వాత పెట్రోల్‌ అయిపోయినట్టు ఉందని చెప్పి సర్వీస్‌రోడ్డుపైకి మళ్లించాడు.అప్పుడు ఉదయం ఏడు గంటల సమయం. చలి, మంచు వల్ల ఇంకా మబ్బుగానే ఉంది. దీంతో మనుష్య సంచారం అంతగా లేని, పైగా దట్టంగా కమ్ముకున్నట్టుగా ఉన్న చెట్ల దారికి బైక్‌ను మళ్లించాడు. ఆ దారిలో ముందు వెనుకా ఏముందో తెలియనంతగా మంచు ఉంది. అతడు దీన్ని ఆసరాగా తీసుకున్నాడు. 
సడన్‌గా బండి ఆపాడు.

అప్పటి వరకు అతనికి దొంగతనం చేయాలన్న ఆలోచనే ఉంది. ఇప్పుడు పాడు ఆలోచన వచ్చింది.అనూహ్య ఇది గమనించింది. క్షణంలో అక్కడి నుంచి పరిగెత్తడానికి ప్రయత్నించింది. అతడు ఆమెను పట్టుకున్నాడు. కోపంగా ఆమె తలను భూమికి గట్టిగా బాదాడు. స్కార్ఫ్‌తో గొంతు నులిమాడు. ఆ∙పెనుగులాటలో అనూహ్య ప్రాణాలు విడిచింది. నేరం జరిగే సమయంలో నేరం చేసేవాడు అపస్మారక స్థితికి వస్తాడు. నేరం జరిగిపోయాక ఏం జరిగిందో తెలిసేసరికి ప్రళయం వచ్చినట్టు ఒణికిపోతాడు. చంద్రబాన్‌ అలాగే ఒణికిపోయాడు. అనూహ్య ల్యాప్‌టాప్‌తో ఉన్న బ్యాగ్‌ను తీసుకుని కంజూర్‌మార్గ్‌లోకి వెళ్లాడు. ఆమె వద్ద ఉన్న ఫోన్‌లో తన సెల్‌ నెంబరు ఉంటుందని భయపడి మళ్లీ సంఘటన స్థలానికి వచ్చాడు. అయితే సెల్‌ఫోన్‌ కన్పించలేదు. దీంతో బైక్‌లోని పెట్రోల్‌ను కొంత తీసి నిప్పంటించేందుకు ప్రయత్నించాడు. కానీ తగినంత పెట్రోల్‌ లేకపోవడంతో కుదరలేదు.అక్కడి నుంచి కంజూర్‌మార్గ్‌లోని మిత్రుడు నందకిషోర్‌ను కలిసి అతని బైక్‌ని అతనికి ఇచ్చేశాడు. జరిగినదంత నందకిషోర్‌కు చెప్పి అదే రోజు ఉదయం 10 గంటల సమయంలో ములూండ్‌ నుంచి ఓ ట్యాంకర్‌లో నాసిక్‌కు వెళ్లిపోయాడు. నాసిక్‌కు పారిపోయిన చంద్రబాన్‌ తన గెటప్‌ను కొంత మార్చుకుని అక్కడే ఉండిపోయాడు. అయితే భయం వల్ల మళ్లీ ముంబైకి రావడం మొదలుపెట్టాడు. జ్యోతిష్యం మీద నమ్మకమున్న చంద్రబాద్‌ ఓ జ్యోతిష్యున్ని సంప్రదించాడు. జ్యోతిష్యుని ద్వారా తన సమయం బాగాలేదని తెలుసుకున్న చంద్రబాన్‌ దోషనివారణ పూజలు చేయాలనుకున్నాడు. కాని పాపం చేసినవాడి పూజలు ఫలించవని పోలీసులు చుట్టుముట్టడంతో తెలుసుకున్నాడు.పోలీసులు ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేసి మే 26న 542 పేజీలున్న చార్జీషీటును దాఖలు చేశారు. 76 మంది సాక్షులను విచారించి సంబంధిత ఆధారాలు, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలంతో నిందితుడిని కోర్టులో ప్రవేశపెట్టారు. 
అక్టోబరు 27, 2015.
కోర్టు చంద్రబాన్‌ను దోషిగా నిర్థారించింది. అక్టోబరు 30న చంద్రబాన్‌కు ఉరి శిక్ష విధించింది.  
– గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top