తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తమ వైఖరిని స్టీరింగ్ కమిటీలో నిర్ణయించి ప్రకటిస్తామని టీ-జేఏసీ నేతలు వెల్లడించారు.
మీట్ ది ప్రెస్లో టీ-జేఏసీ నేతలు
ఆ పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే మా వైఖరేమిటో నిర్ణయిస్తాం
స్టీరింగ్ కమిటీలో చర్చించి ప్రకటిస్తాం
ఉద్యమ ద్రోహులను పార్టీల్లో చేర్చుకోవద్దు... ప్రజలు, పల్లెలే కేంద్రంగా అభివృద్ధి జరగాలి
ప్రైవేటు రంగంలోనూ స్థానిక రిజర్వేషన్లు ఉండాలి
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశంతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే తమ వైఖరిని స్టీరింగ్ కమిటీలో నిర్ణయించి ప్రకటిస్తామని టీ-జేఏసీ నేతలు వెల్లడించారు. తెలంగాణకు వ్యతిరేకంగా నిలిచిన టీడీపీని కచ్చితంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులను ఓడించాల్సిందేనని, వారిని చేర్చుకునే పార్టీల నాయకత్వంపైనా విశ్వాసం పోతుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్(టీయూడబ్ల్యూజే) ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో టీ-జేఏసీ చైర్మన్ కోదండరాం, నేతలు మల్లేపల్లి లక్ష్మయ్య, దేవీప్రసాద్, విఠల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యతిరేకులు అధికారం చేపడితే ఈ ప్రాంత పునర్వికాసానికి అది దోహదపడదని ఈ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. అమరుల నిబద్ధతలో కొంతైనా రాజకీయ పార్టీలకు ఉండాలన్నారు. ఇప్పటివరకు గుప్పెడు మంది కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, పెట్టుబడిదారుల చుట్టూనే అభివృద్ధి కేంద్రీకృతమైందని, ఇకపై ప్రజలు, పల్లెలే లక్ష్యంగా తెలంగాణలో అభివృద్ధి జరగాలని ఆకాంక్షించారు.
సంక్షేమ పథకాలు పొందడం ప్రజలకు హక్కుగా సంక్రమించాలని, ఆ దిశగా కొత్త ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జేఏసీ నేతలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పరిరక్షణ, అమలుకు పౌర సమాజం తరఫున జేఏసీ ప్రయత్నిస్తుందన్నారు. పార్టీల మేనిఫెస్టోలపై అధ్యయనం చేస్తున్నామని, అధికారంలోకి వచ్చే పార్టీ మేనిఫెస్టో కచ్చితంగా అమలయ్యే విధంగా నిపుణులతో కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు ఉద్యమ నేతలు పేర్కొన్నారు. దళిత సీఎంపై వెనక్కి వెళ్లిన పార్టీపై ఆ వర్గాలే నిర్ణయం తీసుకుంటాయని మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ కొనసాగడంపై కోదండరాం స్పందిస్తూ... స్వాతంత్య్రం అనంతరం కాంగ్రెస్ కొనసాగడంపై కూడా ఇవే ప్రశ్నలు వచ్చాయన్నారు. అయితే, స్వాతంత్య్రం కోసం పోరాడిన ఉద్యమ పార్టీ అధికారంలోకి వస్తేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరవచ్చుననే అభిప్రాయం వ్యక్తమైందన్నారు.
టీఆర్ఎస్ కూడా తెలంగాణ వికాసం కోసమే ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా మారిందని కోదండరాం అభిప్రాయపడ్డారు. ్హ తెలంగాణలో కొత్త ప్రభుత్వం లక్షకుపైగా ఉద్యోగాలకు ఒకేసారి నోటిఫికేషన్ జారీ చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించాలి. ్హ స్థానికత ఆధారంగానే ఉద్యోగుల విభజన జరగాలి. తెలంగాణ సచివాలయాన్ని ఆంధ్రా ఉద్యోగులతో నింపితే మరోసారి పెద్ద ఎత్తున పోరాటం వస్తుంది.్హ ప్రైవేటు రంగంలోనూ స్థానిక రిజర్వేషన్లు అమలు చేయాలి. ్హ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలి. ్హ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు వేర్వేరు బ్లాకులను కేటాయించాలి. ఇరు ప్రభుత్వాల ఉద్యోగులను ఒకే బ్లాకులో ఉంచితే సమస్యలు వస్తాయి. గత జూలై 30 తర్వాత కిరణ్కుమార్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కొత్త ప్రభుత్వం సమీక్షించాలి.