జగనొక్కడే.... | Sakshi
Sakshi News home page

జగనొక్కడే....

Published Wed, Apr 23 2014 12:22 PM

జగనొక్కడే.... - Sakshi

కర్నూలు:  విద్యార్థులకు  ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం జగనన్న ఒక్కడే  వారం రోజుల పాటు మెతుకు ముట్టలేదని వైఎస్ఆర్ సిపి నాయకురాలు వైఎస్ షర్మిల గుర్తు చేశారు. కల్లూరు జరిగిన వైఎస్ఆర్ సిపి జనభేరి సభలో ఆమె ప్రసంగించారు. రైతులకోసం రోజుల తరబడి నిరాహారదీక్ష చేసింది కూడా  జగనేనన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం పదవులు కాదనుకున్నాడు. చెయ్యని నేరానికి జైలుకు కూడా వెళ్లాడు జగనన్న అని చెప్పారు.  జగనన్నకు మీ మొహంలో చిరునవ్వు చూడటమే ముఖ్యం అన్నారు. అలాంటి నాయకుణ్ని ముఖ్యమంత్రిని చేసుకుందాం అని పిలుపు ఇచ్చారు. రాజన్న రాజ్యాన్ని తెచ్చుకుందాం అన్నారు. ఈ ఐదేళ్లలో ప్రజా సమస్యలపై స్పందించింది వైఎస్ఆర్ సిపి  మాత్రమేనన్నారు.

ఇతర పార్టీలు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఓటేసే ముందు ఒక్కసారి ఆలోచించమని ఓటర్లకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసి జగనన్న ప్రభుత్వాన్ని తెచ్చుకుందాం అన్నారు. ఆ మహానేత రాజశేఖర్‌రెడ్డి పాలనలో ఏ ఒక్క ఛార్జి పెంచలేదు. రూపాయి కరెంట్‌ ఛార్జి కూడా పెంచలేదని గుర్తు చేశారు. అద్భుతంగా పాలించిన రికార్డు వైఎస్‌ఆర్ సొంతం అన్నారు. మన దురదృష్టంకొద్దీ వైఎస్‌ మరణాంతరం సీల్డ్‌కవర్‌లో  కిరణ్‌కుమార్‌రెడ్డి ఊడిపడ్డారన్నారు.  కిరణ్ పాలనలో అన్ని ధరలు పెరిగి పేదలు అల్లాడిపోయారని చెప్పారు. ఐదేళ్లలో ఏ ఒక్క కొత్త కార్డు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సర్‌ ఛార్జీలు అంటూ 32 వేల కోట్ల రూపాయలు  ప్రజల నెత్తిన మోపి బెదిరించి వసూలు చేసిందన్నారు.

చంద్రబాబు నాయుడు పాలనలో 8 సార్లు కరెంట్ ఛార్జిలు పెంచారన్నారు. ఈ ఐదేళ్లలో ఏనాడైనా ప్రజాసమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారా? అని అడిగారు. విప్ జారీచేసి మరీ కిరణ్ ప్రభుత్వాన్ని బాబు కాపాడారని విమర్శించారు. రాష్ట్రం ముక్కలయ్యిందటే దానికి కారణం బాబేన్నారు. పలానా మంచి పనిచేశాను, ఓట్లేయ్యండి అని అడిగే ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయని మళ్లీ దొంగ వాగ్దానాలు మొదలెట్టారన్నారు.  అన్నీ ఆల్‌ ఫ్రీ అంటూ ముందుకొస్తున్నాడు చంద్రబాబు జాగ్రత్త అని ఓటర్లను హెచ్చరించారు.

ఇప్పుడు రుణమాఫీ అంటున్న చంద్రబాబు తన పాలనలో రైతుల రుణమాఫీ కోసం ఆలోచించాడా? అని అడిగారు. రుణమాఫీ మాట దేవుడెరుగు, కనీసం వడ్డీ మాఫీ కోసం కూడా ఆలోచించలేదన్నారు. రాష్ట్రాన్ని సింగపూర్ చేస్తానంటున్న బాబు తన 9ఏళ్లపాలనలో ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు. బాబు మాటల్లో, వాగ్దానాలలలో నిజంలేదని షర్మిల చెప్పారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement