అవసరమైతే పోలింగ్ బూత్‌లోకి పోలీసులు | Necessary Polling booth in police | Sakshi
Sakshi News home page

అవసరమైతే పోలింగ్ బూత్‌లోకి పోలీసులు

Apr 3 2014 4:35 AM | Updated on Sep 17 2018 6:08 PM

నేరస్తులుగా పాతరికార్డులు ఉన్న వ్యక్తులు ఓటువేసేందుకు బూత్‌లలోకి వెళ్ళిన సమయంలో పోలింగ్ అధికారుల అభ్యర్థనపై పోలీసులు వారి

నరసరావుపేటవెస్ట్, న్యూస్‌లైన్ :నేరస్తులుగా పాతరికార్డులు ఉన్న వ్యక్తులు ఓటువేసేందుకు బూత్‌లలోకి వెళ్ళిన సమయంలో పోలింగ్ అధికారుల అభ్యర్థనపై పోలీసులు వారి వెంట ఉంటారని గుంటూరు రేంజ్ ఐజీ సునీల్‌కుమార్ చెప్పారు.  ఎంపీటీసీ, జెడ్పీటీసీ, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బుధవారం నరసరావుపేట డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ  పాత నేరస్తులు, రికార్డులు ఉన్న వ్యక్తులు పోలింగ్ బూత్‌లలోకి వెళుతుంటే క్షుణ్ణంగా సోదాలు నిర్వహిస్తామని చెప్పారు.  మాచర్లలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనలో పోలీసులు సమయానికి స్పందించి మాజీ ఎమ్మెల్యే, అతని అనుచరులను వెంటనే అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినందుకు పోలీసులను ప్రశంసిస్తున్నానన్నారు. ఇంకా రెండు విడతల ఎన్నికలను పోలీసులు ఎదుర్కోవాల్సి ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తమ అధికారులు, సిబ్బంది చాలా బాగా పనిచేశారని కొనియాడారు. సమావేశంలో రూరల్ ఎస్పీ జె.సత్యనారాయణ, నరసరావుపేట డీఎస్పీ డి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
 
 ఎన్నికల నిబంధనలపై పుస్తకాలు ముద్రణ
 ఏటీ అగ్రహారం(గుంటూరు): ఎన్నికల నిబంధనలపై ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూరల్ జిల్లా ఎస్పీ జె.సత్యనారాయణ పలు రకాల సూచనలు ఆదేశాలతో కూడిన నూతన పుస్తకాలను రూపొందించారు. రెండు రకాలుగా రూపొందించిన ఈ పుస్తకాల్లో ఎన్నికల బందోబస్తు, డ్యూటీ సమయంలో అధికారులు, సిబ్బంది నిర్వహించాల్సిన విధులు, పలు సూచనలతో కూడిన వివరాలను పొందుపరిచారు. వీటిని జిల్లాలోని అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులకు, ప్రజలకు పంపిణీ చేసేందుకు 5 వేల పుస్తకాలను సిద్ధం చేశారు. అదేవిధంగా అర్బన్ జిల్లా పరిధిలో కూడా పంపిణీ చేసేందుకు రెండువేల పుస్తకాలను సిద్ధం చేస్తున్నారు. మరో రెండ్రోజుల్లో పుస్తకాలను ఆయా పోలీసు స్టేషన్లకు పంపనున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement