‘టీడీపీ అధినేత చంద్రబాబు రెండు, మూడు బిల్డింగులు కట్టేసి హైదరాబాద్ మొత్తం తానే అభివృద్ధి చేశానంటున్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘‘టీడీపీ అధినేత చంద్రబాబు రెండు, మూడు బిల్డింగులు కట్టేసి హైదరాబాద్ మొత్తం తానే అభివృద్ధి చేశానంటున్నారు. అలా అయితే అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్రోడ్డును పూర్తిచేసి హైదరాబాద్కు ఐదు టీఎంసీ నీళ్లు ఇచ్చి.. ఇన్ని చేసిన రాజశేఖరరెడ్డి ఏమనాలి? చంద్రబాబు హైదరాబాద్కు చేసినదాని కంటే వైఎస్ చేసింది వందరెట్లు ఎక్కువ. కాకపోతే రాజశేఖరరెడ్డికి గొప్పలు చెప్పుకోవడం తెలియదు, మీడియాను మ్యానేజ్ చేయడంరాదు. వినేవారుంటే వైఎస్ అమలు చేసిన అన్ని సంక్షేమ పథకాలూ కూడా తానే పెట్టానని అబద్ధాలు చెప్పగల సమర్థుడు చంద్రబాబు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల అన్నారు.
‘‘64 కళల్లో దొంగతనం ఒక కళట. కన్నార్పకుండా ఎన్ని అబద్దాలైనా చెప్పే ఆ కళ చంద్రబాబు సొంతం. ఆయన్ను నమ్మి మోసపోవద్దు’’ అని అన్నారు. గుంటూరు జిల్లాలో ‘వైఎస్సార్ జనభేరి’ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రేపల్లె, తెనాలి, సత్తెనపల్లి, బెల్లంకొండ, పిడుగురాళ్ల బహిరంగ సభల్లో ఆమె మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తామని, సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. కానీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాక ఏ ఒక్క హామీ అయినా నిలబెట్టుకున్నారా అని ప్రశ్నిం చారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్ర విభజనకు కారణమైన చంద్రబాబు సీమాంధ్రలో అడుగుపెడితే తరిమి కొట్టాలని ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.