ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్ఆర్సీపీ యువభేరీ కార్యక్రమం, బహిరంగ సభ రేపు(బుధవారం) తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జరుగనున్నాయి.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన వైఎస్ఆర్సీపీ యువభేరీ కార్యక్రమం, బహిరంగ సభ రేపు(బుధవారం) తూర్పు గోదావరి జిల్లా, కాకినాడలో జరుగనున్నాయి. ఈ సందర్భంగా కాకినాడ అంబేడ్కర్ భవన్లో ఏపీకి ప్రత్యేక హోదాపై విద్యార్థులు, యువతతో వైఎస్ ముఖాముఖి నిర్వహించనున్నారు. యువభేరీ కార్యక్రమం అనంతరం కాకినాడలో జేఎన్టీయూ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో వైఎస్ జగన్ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
ఈ నేపథ్యంలో యువభేరీ సభకు పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ కోరింది. కాగా, వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ, ఆయన తనయుడు శశిధర్, మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు చేరనున్నట్టు సమాచారం. ఇదిలా ఉండగా, ఈ నెల 21న కాకినాడలో యువభేరీ కార్యక్రమం జరగాల్సి ఉండగా, అందులో స్వల్ప మార్పుతో ఈ కార్యక్రమాన్ని 27న నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత వారం ఒక ప్రకటన విడుదల చేసిన సంగతి తెలిసిందే.