మునుగోడు:
గత కొన్నేళ్లుగా ఉద్యోగం చేస్తున్న తమను అర్ధంతరంగా విధుల నుంచి తొలగించారని అధికారుల ఎదుట పురుగుల మందు తాగి ఇద్దరు మహిళా ఉద్యోగులు ఆత్మహత్యకు యత్నించారు. ఈ సంఘటన మంగళవారం మునుగోడులో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, ఐసీడీఎస్ అధికారుల వివరాల ప్రకారం.. నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పనిచేస్తున్న కార్యకర్త మెరుగు మంజుల, ఆయా మేకల మంజులను సంబంధిత శాఖ అధికారులు సస్పెండ్ చేస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఆ సస్పెండ్ లెటర్ను వారు పోస్టులో పంపితే తీసుకోకపోవడంతో సదరు ప్రాజెక్టు అధికారి తన కార్యాలయానికి పిలిపించి వారి చేతికి అందించారు. దానిని తీసుకున్న ఇరువురు తమ వెంట తెచ్చుకున్న పురుగుల మందు డబ్బా మూత తీసి ఆమె ఎదుటనే తాగి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించారు. అది గమనించిన సీడీపీఓతో పాటు, ఆ కార్యాలయంలోని ఉద్యోగులు వారిని అడ్డుకున్నారు. కానీ అప్పటికే ఆయా కొంత ఎక్కువ మొత్తంలో తాగి సొమ్మసిల్లి పడిపోగా, కార్యకర్త కూడా తాగింది. వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తరలించి ప్రాథమిక వైద్యం అందించారు. మెరుగైన వైద్యం కోసం 108లో నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.